రూపాయి భారీ పతనం
డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్ఠానికి పడిపోయిన విలువ
మన దిగుమతులపై తీవ్ర ప్రభావం
పెరగనున్న నిత్యావసరాల ధరలు
ముంబై, మే 15: పెరుగుతున్న ముడి చమురు ధరలు, కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణ కరెన్సీపై ఒత్తిడిని కొనసాగించడంతో, శుక్రవారం రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 96 మార్కును దాటి, సరికొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి డాలర్తో పోలిస్తే 0.3% బలహీనపడి 96.05కు చేరింది, గత సెషన్లో తాకిన తన మునుపటి సర్వకాలీన కనిష్ట స్థాయి 95.9575ను అధిగమించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మన దేశ రూపాయిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారతాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురును అమెరికన్ డాలర్లలో కొనుగోలు చేస్తారు. ఇది ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. రూపాయి పతనం కావడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగవచ్చు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ముడి పదార్థాలు వంటి దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. అలాగే నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్పణం పెరిగి, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. విదేశీ ఉన్నతవిద్య కోసం తమ పిల్లల్ని పంపిన తల్లిదండ్రులపై భారం పెరుగుతుంది. అయితే అదే సమయంలో మనదేశం నుంచి వస్తువులు, సేవలు ఎగుమతి చేసేవారికి మాత్రం ప్రయోజనం కలుగుతుంది.






