29-05-2025 02:30:45 AM
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ, మే 28 (విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
బుధవారం రఘునాథ్ పల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణ భూమి పూజ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నూతన సబ్ స్టేషన్ ల ద్వారా మండల గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయని అన్నారు.
పేద ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తుందని తెలియజేశారు. ఎంపీ నిధులనుండి ఐదు లక్షల రూపాయలతో మహిళ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు ఇస్తానన్నారు.
మల్లన్న సాగర్ నుండి కుర్చపల్లికి వచ్చే కాల్వపనులు ముమ్మరంగా సాగుతున్నా యని, వాన కాలంలోగా కుర్చపల్లిలోని చెరువులు, కుంటలు నింపి ప్రతి పంటకు సాగునీరు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాంబాబు, మరియు ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యుత్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.