calender_icon.png 26 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలదే ఈ శకం

26-01-2026 01:54:29 AM

  1. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
  2. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావమే మన దేశ పునాదులు
  3. దేశ సాహిత్య జాతీయ ప్రార్థనగా వందేమాతరం
  4. దేశ విధిరాతను మార్చిన మహత్తర ఘట్టమే స్వాతంత్య్ర పోరాటం
  5. గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, జనవరి 25 : మహిళలదే ఈ శకమని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధీమా వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము ఆదివారం రాత్రి చేసిన ప్రసంగం.. వికసిత్ భారత్ ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది. ఒకవైపు దేశ మహిళలు క్రీడలు, అంతరిక్షం, రక్షణ రంగాల్లో సృష్టిస్తున్న రికార్డులను కొనియాడారు. దేశభక్తి, రాజ్యాంగ విలువలు, మహిళా శక్తి, నేతాజీ స్ఫూర్తి, వందేమాతరం ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు.

విదేశీ పాలన సంకెళ్ల నుంచి భారతావనిని విముక్తి చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె ఘన నివాళులర్పించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, గత ఏడాది కాలంలో భారత్ సాధించిన అద్భుత విజయాలను ఆమె వివరించారు. దేశ ప్రగతిలో మహిళల పాత్రను, ఆర్థిక వృద్ధిని ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

జనవరి 26, 1950న మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ, భారతదేశం బానిసత్వం నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిర్భవించిందని అన్నారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే ఆదర్శాలే మన దేశ పునాదులని ఆమె తెలిపారు.

వందేమాతరం గీత విశిష్టతను వివరిస్తూ.. బంకించంద్ర చటోపా ధ్యాయ స్వరపరిచిన ఈ గీతం దేశ సాహిత్య జాతీయ ప్రార్థనగా మారిందని రాష్ట్రపతి అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ఈ గీతాన్ని ఎలా ప్రాచూర్యంలోకి తెచ్చారో గుర్తుచేశారు. అలాగే పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ దేశభక్తిని, ఆయన నినాదం జైహింద్ స్ఫూర్తిని యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధికి సాధికారత మహిళలు అత్యంత అవసరం

దేశాభివృద్ధికి సాధికారత కలిగిన మహిళలు అత్యంత అవసరమని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 57 కోట్ల జన్ ధన్ ఖాతాలలో 56 శాతం మహిళలవేనని, 10 కోట్లకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయని తెలిపారు. మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచ కప్ గెలవడాన్ని, చదరంగంలో సాధించిన విజయాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ రాజ్యాంగం దేశంలోని మహిళలను మరింత శక్తివంతం చేస్తుందని, పంచాయతీ రాజ్ సంస్థల్లో ఇప్పటికే 46శాతం మహిళా ప్రాతినిథ్యం ఉండటం గర్వకారణమని అన్నారు. ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయం, స్టార్టప్లు, ఆవిష్కరణలు దేశ భవిష్యత్తుకు కీలక స్తంభాలని ఆమె అభివర్ణించారు.

అందరి సహకారం.. దేశ ప్రగతికి సోపానం

దేశ సరిహద్దులను కాపాడే సైనికులు, అంతర్గత భద్రతను పర్యవేక్షించే పోలీసులు, ఆహారాన్ని అందించే రైతులు, పౌరుల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులు, నర్సుల సేవలను రాష్ట్రపతి కొనియాడారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారని ప్రశంసించారు. స్వావలంబన, ప్రగతిశీల భారతదేశం కోసం మనమం దరం ఐక్యతతో, సమిష్టి సంకల్పంతో పనిచేయాలి అని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పిలుపు ఇచ్చారు.

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

మన సైనిక దళాల సన్నద్ధత పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రయాణం, రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తూ, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్ భారతాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అని, సమ్మిళిత వృద్ధి ద్వారానే దేశం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మన స్వాతంత్య్ర పోరాటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, అది దేశ విధిరాతను మార్చిన మహత్తర ఘట్టమని అభివర్ణించారు.

సోమవారం వేడుకలను స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భారతీయులంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత్ తన భవిష్యత్తును స్వయంగా లిఖించుకోవడం ప్రారంభించిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. రాజ్యాంగం అమలులోకి రావడంతోనే భారత్ నిజమైన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద గణతంత్ర రాజ్యానికి మన రాజ్యాంగమే పునాది అని, ఇందులో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలు మన దేశానికి ప్రాణవాయువులాంటివని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఈ విలువల వల్లే జాతీయతా భావం, దేశ సమగ్రత బలంగా వేళ్లూనుకున్నాయని ఆమె వివరించారు.