బైక్పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం
అమరావతి: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో(Anakapalli district) ట్రిపుల్ రైడింగ్ ముగ్గురి ప్రాణాలనూ బలిగొంది. ఈ ఘోర ప్రమాదం గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం కూడలి సమీపంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ అతివేగంగా రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతులు పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లకు గోవిందు (25), పోతిరెడ్డిపాలెంకు చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16)గా గుర్తించారు. నాని, గోవిందు పెయింటర్లుగా పనిచేస్తుండగా, దుర్గాప్రసాద్ విద్యార్థి. రాత్రి 10:00 గంటల ప్రాంతంలో పురుషోత్తపురంలో అమ్మవారి జాతరకు హాజరయ్యేందుకు ముగ్గురు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పోతిరెడ్డిపాళెం వద్ద దుర్గాప్రసాద్ను దింపుతుండగా జంక్షన్ సమీపంలో వీరి బైక్ను విజయవాడ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ముగ్గురు చనిపోవడంతో స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




