17-12-2025 12:25:24 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో తుది విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మూడో విడత ఎన్నికలకు 4,159 గ్రామ పంచాయతీలను నోటిఫై చేయగా 11 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు 116 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ వేసిన గ్రామాల్లోనూ రెండు సర్పంచ్ స్థానా లు, 18 వార్డులకు వివిధ కారణాలతో స్టే ఉం డటంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఈ తుది విడతలో 53,06,401 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,01,861, మహిళలు 27,04,394, ఇతరులు 140 మంది ఓటర్లు ఉన్నారు.