రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతి
మొయినాబాద్ మార్చి 22(విజయ క్రాంతి) రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్-బీజాపూర్ రహదారి మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన వల్లబొద్దు విజయ్ కుమార్ (54) వృత్తి సరోజినీ కంటి ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పనిచేస్తున్నాడు.
ఇటీవలే మూడు సంవత్సరాల క్రితం మొయినాబాద్ మండల పరిధిలోని అమ్దాపూర్ గ్రామంలో భార్య ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం పనిపై బయటకు వెళ్లిన విజయ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి నార్సింగి నుండి అమ్దాపూర్ గ్రామానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యలోని వీఆర్కే కళాశాల చేరుకోగా.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వీఆర్కే కళాశాల ప్రహరీ గోడను ఢీకొట్టింది.
ప్రమాదంలో విజయ్ కుమార్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




