20 May, 2026 | 2:46 AM

టౌన్‌షిప్‌కు తాగునీరందించాలి

20-05-2026 01:46 AM

అధికారులకు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జీ పరమేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి

కుషాయిగూడ, మే 19 (విజయక్రాంతి): కాప్రా సర్కిల్ ఏఎస్‌రావు నగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్‌రెడ్డి జలమండలి అధికారులను కోరారు.

టౌన్‌షిప్ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి వినతిపత్రం అందజేశారు. 132 ఎకరాల్లో విస్తరించిన టౌన్‌షిప్‌లో 2,400 కుటుంబాలు నివసిస్తున్నాయని, డంపింగ్ యార్డ్ సమీపంలో ఉండటంతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలుషిత నీరు తాగడంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు.

టౌన్‌షిప్‌కు తక్షణమే శుద్ధి చేసిన తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని, అవసరమైతే కొత్త రిజర్వాయర్ నిర్మించాలని, యుద్ధ ప్రాతిపదికన పైప్‌లైన్లు వేయాలని కోరారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని ఈడీ పంకజ హామీ ఇవ్వగా, కాలనీ ప్రతినిధులు పరమేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.