విశాఖపట్నం ఇక నుంచి AI పట్నం.. దక్షిణాదిపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
దక్షిణాదిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం: విశాఖ గూగుల్ ఏఐ డెటా సెంటర్ ప్రారంభంలో దక్షిణాదిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదని ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఇకపై ఏఐ పట్నం అని పిలుస్తారని, ఈ రోజు విశాఖపట్నం అంటే? సైబరాబాద్ లాగా, ఇది ఏఐ పట్నం అవుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. బుల్లెట్ రైళ్ల ద్వారా దక్షిణాది ముఖచిత్రం మారబోతోందని చెప్పారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్-ముంబై, అహ్మదాబాద్-హైదరాబాద్ మధ్య అతి త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వస్తోందన్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తే అహ్మదాబాద్-హైదరాబాద్ జర్నీ కేవలం 70 నిమిషాలు మాత్రమే అన్నారు.
బుల్లెట్ రైళ్లతో హైస్పీడ్ డైమండ్ ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. హైస్పీడ్ డైమండ్.. దక్షిణాది పట్ల తమకున్న నిబద్ధతకు తార్కాణం అన్నారు. దక్షిణాది పట్ల వివక్ష ఉందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని అభివృద్ధితో తిప్పి కొడుతున్నామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అన్ని రంగాల్లో దక్షిణాదికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు అన్ని రంగాల్లోనూ భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మోదీ సర్కార్ అన్ని రాష్ట్రాలకూ సమాన అవకాశాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు. సదరన్ స్టేట్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దక్షిణాది అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పునరుద్ఘాటించారు. విపక్షాలు చెప్పేది అబద్దమని ప్రతిసారి రుజువవుతోందన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్షఅని కేంద్రమంత్రి వెల్లడించారు.






