04-06-2025 12:08:09 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, జూన్ 3 : (విజయ క్రాంతి) ః భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రజలకు సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, దర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు.
రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సుల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
భూరికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూస్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు,
భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహశీల్దార్లు సతీష్ రెడ్డి, శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.