calender_icon.png 22 November, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తాం

22-11-2025 05:22:34 PM

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలి

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బోయినపల్లిలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

బోయినపల్లి (విజయక్రాంతి): అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బోయినపల్లి రైతు వేదికలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి* కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. జిల్లాలోని సిరిసిల్లలో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారై రాష్ట్ర మంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 32 జిల్లాల నుంచి ఎస్ హెచ్ జీ ల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మత్తుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.

స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు ఇప్పుడు ఎస్ హెచ్ జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.200 యూనిట్ ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడైతే మహిళలు సంతోషంగా ఉంటారో... ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు.

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్లేష్ యాదవ్, వైస్ ఛైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, డీఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరాల నర్సింగం, జిల్లా నాయకులు కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మి రాజo, ఏనుగుల కనుకయ్య, ఏపీఎం, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.