23-06-2025 09:48:59 PM
విద్యార్థుల సంఖ్య పెంచేలా అందరూ కృషి చేయాలి
పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం కట్కూరి శ్రీనివాస్ రాధిక దంపతుల కుమార్తె అశ్విని జ్ఞాపకార్థం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సౌజన్యంతో పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులకు షీల్డ్, నగదు బహుమతులు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిరాధారణకు గురయ్యాయని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అశ్విని జ్ఞాపకార్థం కట్కూరి శ్రీనివాస్ రాధిక దంపతులు బహుమతులు ప్రధానం చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, ఎంఈఓ ఊరుకొండ ఉప్పలయ్య, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బోనాల రాజ మౌళి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, దేసు సతీష్ కుమార్, దూలం కుమారస్వామి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దూడపాక శంకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మోట పోతుల శివ శంకర్ గౌడ్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, మార్త వెంకటరమణయ్య, కాంపాటి కృష్ణమూర్తి, నరహరి, తదితరులు పాల్గొన్నారు.