17-09-2025 06:39:12 PM
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) అని అన్నారు. స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లాలోని లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషలిస్టు వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, పిల్లల వైద్యనీపుణులు, ఫిజీషియన్లు, ఈఎన్ టి, దంత, ఇతర స్పెషలిస్ట్ వైద్యులచే ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరములను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించి, సందేశం అందించిన తర్వాత డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లు మెగా వైద్య శిబిరమును ప్రారంభించారు. టీబీ ముక్త్ అభియాన్లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య శిబిరములు అలాగే అక్కడ అందిస్తున్నటువంటి సేవలు గురించి ఏఎన్ఎంలు, ఆశలు తమ పరిధిలోని మహిళలకు తెలియజేసి శిబిరములకు హాజరయ్యేలా చూడాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మహిళలను ఈ శిబిరములకు హాజరయ్యేలా చూడాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో, సిహెచ్సి పరకాలలో రోజుకు 10 చొప్పున మొత్తం 120 ప్రత్యేక వైద్య శిబిరంలు నిర్వహిస్తున్నామని, టీచింగ్ ఆసుపత్రులు వైద్యవిధాన పరిషత్, వైద్యులతో పాటు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పాగ్సి వైద్యులు, ప్రతిమ రిలీఫ్ వైద్య కళాశాల డాక్టర్లు సేవలందిస్తున్నారని, బుధవారం 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ టి. మదన్మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్, ఐఎంఏ డాక్టర్ అజిత్ మహమ్మద్ డాక్టర్ సుదీప్, గైనకాలజిస్టులు డాక్టర్ ప్రశాంత డాక్టర్ హారిక, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇత్తదర్ అహ్మద్, వైద్యులు డాక్టర్ హైదర్, డాక్టర్ సనత్ చందర్, డాక్టర్ భానుచందర్, డెమో అశోక్ రెడ్డి, ఎన్హెచ్ఎండి పిఎం రుక్ముద్దీన్, ప్రవీణ్, మాధవరెడ్డి, శ్రీనివాస్, బాబు, సూపర్వైజర్లు థామస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.