26-05-2025 01:26:01 AM
హుస్నాబాద్, మే 25 : మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళలు నడుం బిగించారు. గతంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో డ్రగ్స్కు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడిన మహిళలు, ఇప్పుడు అక్కన్నపేట మండలంలోనూ ఉద్యమాన్ని ప్రారంభిం చారు. జేఏసీ, మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మొదలైన పోరుయాత్రలో వందలాది మంది మహిళలు పాల్గొని తమ అచంచలమైన సంకల్పాన్ని చాటారు.
శనివారం అక్కన్నపేట మండలం గోవర్ధన గిరి, రేగొండ, ధర్మారం, పోతారం(జే), కపూర్ నాయక్ తండా గ్రామాల్లో ప్రారంభమైన డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర రెండోరోజు ఆదివారం గౌరవెల్లి, గండిపల్లి, కుందెనవానిపల్లి, రామవరంలో ఉధృతంగా సాగింది. ‘డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, జ్ఞాన సమాజాన్ని నిర్మిద్దాం‘ అనే దృఢ నినాదంతో మహిళలు పిడికిలి బిగించారు. డ్రగ్స్ నిర్మూలన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమయ్యే సంకేతాలను ఈ పోరుయాత్రలు స్పష్టం చేస్తున్నాయి.
ఈసందర్భంగా జేఏసీ నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ మేకల వీరన్న మాట్లాడుతూ గత విజయాల స్ఫూర్తితో మహిళలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘కొన్ని సంవత్స రాల క్రితం మనం గుడుంబా, సారా వ్యతి రేక ఉద్యమాలు చేసి వాటిని నిర్మూ లించుకున్నాం. అదే స్ఫూర్తితో నేడు మనలను పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైన డ్రగ్స్ మహ మ్మారిని మన ఊరి నుంచి తరిమికొట్టాలి‘ అని అన్నారు.
‘మన బిడ్డలను, మన ఊరును, మన ఇంటిని ఈ డ్రగ్స్ బానిసత్వం నుంచి కాపాడుకోవాలి. డ్రగ్స్ రహిత, జ్ఞాన సమాజాన్ని నిర్మించుకుందాం‘ అని అన్నారు. పట్టణాల నుంచి అక్రమ రవాణా ద్వారా గ్రామాల్లోకి చేరుతున్న గంజాయి, కొకైన్, చరస్, హాషిష్, ఎక్స్టసీ వంటి సింథటిక్ డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం డబ్బు సంపాదన కోసమే కొందరు అక్రమార్కులు పేద కుటుంబాల బిడ్డలను డ్రగ్స్కు బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ‘యువతీయువకులు చదువులకు దూరమై డ్రగ్స్కు బానిసలవుతూ బంగారు భవిష్య త్తును నాశనం చేసుకుంటున్నారు.
లోన్ యాప్స్, బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి దాసోహమై ఆత్మహత్యలకు పాల్ప డుతూ కుటుంబాలను వీధిపాలు చేస్తు న్నారు,‘ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సామాజిక విపత్తులను అరికట్టడానికి మహిళలు ముందుండి పోరాడతామని, ఈ ఉద్యమం అక్కన్నపేటతో ఆగదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు.
క్షేత్రస్థాయిలో విస్తృత భాగస్వామ్యం
ముఖ్యంగా మహిళా సంఘాల వివో అధ్యక్షురాళ్లు, వివోఏలతోపాటు సాధారణ మహిళలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్య లో ఈ కార్యక్రమంలో చురుకుగా పాలుపం చుకుంటున్నారు. గ్రామాలు తిరుగుతూ, ప్రతీ ఇంటికీ వెళ్లి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే భీమదేవరపల్లిలో మహిళలు డ్రగ్స్ నిర్మూలనలో చూపిన పట్టుదల, సాధించిన విజయం ఇప్పుడు అక్కన్నపేట మహిళలకు స్ఫూర్తినిస్తోంది.
మహిళలు సంఘటితమైతే ఎలాంటి సామాజిక రుగ్మతలనైనా నిర్మూలించవచ్చని ఈ ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. సమాజ శ్రేయస్సు కోసం మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటం చేయడం, డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పోరుయాత్రలో ఏపీఎం శ్రీనివాస్, అక్కన్నపేట మండల డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర కోఆర్డినేటర్ వేముల జగదీశ్, జేఏసీ నియోజకవర్గ బాధ్యులు కుమారస్వామి, గాండ్ల పద్మ, తాళ్లపల్లి జగన్, ప్రభాకర్, సీసీలు శివ చరణ్ సింగ్, గిరిమల్ల రాజు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తొందూరి ఎల్లయ్య, వివిధ పార్టీల నాయకులు సాయన్న, బుర్ర ప్రభాకర్ , సుధాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, బొమ్మ శ్రీశైలం, గూడాటిపల్లి మాజీ సర్పంచి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.