13-09-2024 12:17:54 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తక్షణమే సీసీ రోడ్డు వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధి భౌరంపేట శివారులో.. త్రిపుర కన్స్ట్రక్షన్, ఆర్ఎస్వీ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను నిర్మించారు. జయపూర్ ప్రధాన రహదారి నుంచి ఆయా విల్లాలకు వెళ్లే దారిలో కిలోమీటర్ మేర రోడ్డు నిర్మించాల్సి ఉన్నా.. హెచ్ఎండీఏ, దుండిగల్ మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఆయా కాలనీవాసులు మట్టిరోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుమార్గం సరిగా లేకపోవడంతో ఇటీవల అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం ఆలస్యం అవడంతో మృతి చెందాడు. ఇక గర్భిణిల పరిస్థితి వర్ణనాతీతం. ఆయా విల్లాల వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకుండానే హెచ్ఎండీఏ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఓ వ్యక్తి ఆ రోడ్డు మార్గం స్థలం తనదని.. ఆ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా అధికారులు, ప్రజా ప్రతినిధుల చు ట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య తేలడం లేదు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు సమస్య పరిష్కరిం చాలని కాలనీవాసులు కోరుతున్నారు.