28-06-2025 11:15:24 PM
బీఎన్ రెడ్డి నగర్ లో ఘటన
అనుమతులు లేకుండా కొనసాగుతున్న డి అడిక్షన్ సెంటర్
ఎల్బీనగర్: వ్యసనాలకు బానిసైన యువకుడు మారి ఇంటికి వస్తాడు అనుకుంటే శవమై వచ్చాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన యువకులను మార్చుతామని చెప్పి... అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న రిహాబిటేషన్ అండ్ డి అడిక్షన్ కేంద్రాలు మృత్యు కారాగాలుగా మారుతున్నాయి. అనుమతులకు విరుద్ధంగా కొనసాగుతున్న డీ అడిక్షన్ కేంద్రాల పర్యవేక్షణను అధికారులు విస్మరించడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డి అడిక్షన్ కేంద్రంలో చేరిన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కొన్సాన్ పల్లి గ్రామానికి చెందిన 19 ఏండ్ల యువకుడు గంజాయికి బానిసయ్యాడు.
ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు దారి తప్పడంతో తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యారు. తెలిసినవారు చెప్పడంతో బీఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ దగ్గర న్యూ(జర్ని) వరల్డ్ రిహబిటేషన్, డి అడిక్షన్ సెంటర్ లో మూడు రోజుల క్రితం యువకుడిని చేర్పించారు. డి అడిక్షన్ కేంద్రంలో సరైన వసతులు, వైద్యనిపుణుడు లేకపోవడంతో సదరు యువకుడు మానసిక ఆందోళనకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో సైతం ఒక యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.