21-06-2025 02:22:50 AM
అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘తండేల్’గా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు నిర్మాణ దశలో ఉండగా.. మరోవైపు నాగచైతన్య 25వ చిత్రానికి రంగంసిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మేకింగ్లో ఉన్న సినిమా తర్వాత చైతూ 25వ చిత్రం పట్టాలెక్కనుండగా.. దానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు.
మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్న ఈ సినిమా కథను డైరెక్టర్ శివ నిర్వాణ ఇప్పటికే చైతూకు చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం అయిపోయింది. గతంలో నాగచైతన్య, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘మజిలీ’ విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అందుకే వీరిద్దరు రెండోసారి చేతులు కలిపారని, రాబోయే చిత్రం ‘మజిలీ’ని మించిన భావోద్వేగాలతో సాగుతుందని సమాచారం.
ప్రస్తుతం శివ నిర్వాణ డైలాగ్ వెర్షన్ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ అక్కినేని యువ హీరో కెరీర్లో ఇది మైలుచిత్రం కావటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పట్నుంచే అందరి ఆసక్తి నెలకొంది.