18-09-2025 01:38:59 AM
కేంద్ర సమాచార శాఖ ఫోటో ఎగ్జిబిషన్, పోషణ మాసోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, సెప్టెంబరు17 (విజయక్రాంతి): మారుతున్న జీవనశైలి మార్పుల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సవాళ్లను ఎదుర్కునేందుకు పోషకాహరం తీసుకోవాలని, ఈనెల 17 నుండి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క సూచించారు.
కేంద్ర సమాచార శాఖ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో బుదవారం స్థానిక గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్కు, పోషణ మాసోత్సవాల ప్రారంభోత్సవం కు ముఖ్య అతిథిగా విచ్చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఫోటో ఎగ్జిబిషన్ నిర్వాహకులైన శ్రీధర్ సూరునేని పోషకాహార దృశ్యాలను మంత్రి సీతక్కకు వివరించారు. పోషణమాసం పురస్కరించుకొని ఫీల్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ సూరునేని ఏర్పాటు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్, 360 డిగ్రీ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ తీసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అంగన్వాడీ టీచర్లను కేంద్ర సమాచార శాఖ తరఫున సన్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క మాట్లాడుతూ నెలరోజుల పాటు జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకాహారం ప్రాధాన్యతను వివరించాలని అన్నారు.
గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవలసిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై గ్రామస్థాయిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు తూచడం, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పోషకాహారం ప్రాధాన్యత వివరించడం, కిశోర బాలికలకు వైద్య పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
తల్లిపాల ప్రాధాన్యత, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, పరిశుభ్రత పాటించడం, పోషకాహారాల ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. విద్య, వైద్య, పంచాయతీరాజ్, డిఆర్డీఓ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిశు, మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆంగ్ల మాద్యమంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహాణ, పిల్లలకు అందించే పోషకాహారంలో కాలమాణ పరిస్థితులకు తగినట్లు మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఉత్తమమైన ఆహారం ఆవశ్యకత గురించి తెలియజేసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఫీల్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ ను అభినందించారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. పోషకాహరంపై ఏర్పాటు స్టాల్స్ను సందర్శించారు.