04-12-2024 12:00:00 AM
రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల విషయంలో మెరుగైన విధానాన్ని తేవలసి ఉంది. కొత్త వాహనం కొన్నప్పుడు రవాణా శాఖ 15 ఏళ్లకే రిజిస్ట్రేషన్ చేస్తుంది. తరువాత కూడా తిరగాలంటే రెన్యువల్ చేసుకోవాలి. పబ్లిక్ వాహనాలు నిర్వహణ లోపం, అధిక దూరాల ప్రయాణాలు వంటి కారణాలవల్ల త్వరగా పాడైపోవచ్చు. కానీ, ప్రైవేట్ వ్యక్తిగత వాహనాలు ఫిట్గానే ఉంటాయి. పదిహేనేళ్లలో లక్ష కిలోమీటర్లయినా తిరగని వాహనాలూ ఉంటాయి. పాత లారీలు, ట్రక్కుల నుండి పొగ అధికంగా వస్తూ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
15 ఏళ్ల జీవితకాలం దాటిన బండ్ల (వాహనాల)ను రోడ్లపై తిరగనివ్వడం భావ్యం కాదు. ఈమధ్య రవాణా శాఖ స్క్రాప్ పాలసీని తెచ్చింది. కాలం చెల్లిన వాహనాన్ని ఇస్తే కొత్త బండి జీవిత పన్ను, త్రైమాసిక పన్నుపై నిర్ణీతశాతం మినహాయింపు ఇస్తామని పేర్కొంది. అయితే, ఈ తుక్కు విధానం స్వచ్ఛందమే. 15 ఏళ్లు దాటిన వాహనాల్ని రోడ్లపై తిరగనీయకుండా ప్రత్యేక విధానం తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చెప్పారు. రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య రానురాను భారీగా పెరుగుతున్నది.
కనుక, అన్ని రకాల యజమానులనూ దృష్టిలో పెట్టుకొని మెరుగైన స్క్రాప్ పాలసీని ప్రకటించాలి. కాలుష్య కారక వాహనాలు రోడ్లపైన తిరగడం వల్ల ఎంత పర్యావరణానికి నష్టం వాటిల్లుతున్నట్లే, ఫిట్నెస్తో ఉండికూడా కాలావధి తీరిన వాటికి గ్రీన్టాక్స్ పేరుతో పన్నులు వసూలు చేయడమూ భావ్యం కాదు. కనుక, అందరికీ మేలు జరిగేలా, పర్యావరణ రక్షణ లక్ష్యంతో కాలం తీరిన డొక్కు, కాలుష్య కారక వాహనాలకు స్వస్తి చెప్పేలా మంచి స్క్రాప్ విధానాన్ని ప్రభుత్వం పెట్టాలి. వాహనాల ఫిట్నెట్ పరీక్షల విషయంలో పారదర్శక విధానాన్ని అమలు జరపాలి.
మేకిరి దామోదర్, వరంగల్