04-12-2024 12:00:00 AM
ధర్మ మర్థం చకామంచ ప్రవర్తయతి పాతిచ అధర్మానర్థ విద్వేషానిదం
‘కౌటిలీయాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనమేమిటి?’ అంటే, ‘కౌటిలీయ అధ్యయనం ధర్మార్థ కామా లను ప్రవర్తింపచేస్తుంది’. “అంతేకాదు, అధర్మాన్ని, అనర్థ, ద్వేషాలను నశింపచేస్తుంది. భౌతిక జీవితంలో ప్రగతిని, ఆధ్యాత్మిక జీవితంలో సుగతిని పొందడానికి, పొందిన దానిని సుస్థిరం చేసుకోవడానికి సహాయ పడుతుంది” అంటున్నాడు ఆచార్య చాణక్య. ఉన్నస్థితిని మెరుగు పరుచుకోవడం, ఉన్నత స్థితికి చేరడం, సాధించిన దానిని విస్తరించుకోవడం, విస్తరించిన దానిని నిలుపుకోవడం.. సమర్థత అనిపించుకుంటుంది.
నీతి ఆలంబనతో, వ్యక్తి ఉన్నతంగా ఎదిగే క్రమంలో పడదోసే వ్యతిరేక శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతిఘటించే శక్తులను ఎదిరించి ముందుకు సాగడమే అభ్యుదయం. దానికి అవసరమైన వ్యూహాలను పరిచయం చేస్తుంది ‘కౌటిలీయం’. ‘కౌటిలీయాన్ని’ ఆధ్యయనం చేయడం మాత్రమేకాక ఆచరించడం, మరొకరికి బోధించడం వల్ల కూడా ఫలితం అధికంగా ఉంటుంది. మానవ జీవితం తెలిసిన దానినుండి తెలియని దానివైపు నడుస్తుంది. ఇతరుల మార్గాలలో వెళ్ళేవారికి పాత ఫలితాలే వస్తాయి. కొత్త మార్గాలను అన్వేషించి ఆ మార్గాలలో విజయాన్ని సాధించే వారే చరిత్రను సృష్టిస్తారు. చాణక్య కొత్త మార్గంలో నడిచి చరిత్ర సృష్టించాడు.
వ్యాపార సంస్థలను నిర్మించడానికి ప్రయోజనం.. సంపదను సృజించడం. సృష్టించిన సంపదను అర్హత ప్రాతిపదికగా వినియోగించడం. సంస్థ కార్యకలాపాలు క్రమపద్ధతిలో, నిరాటంకంగా సాగాలి. నిరంతరం ఆదాయాన్ని పొందాలంటే నిరంతరాయంగా ఉత్పత్తులను సాధించడం, మార్కెట్లో వాటి అమ్మకాలను పెంచడం మాత్రమే మార్గం. దానికి ముఖ్యమైన మూడు అంగాలు పటిష్టంగా ఉండాలి. వ్యాపారాన్ని సమర్థృంగా నిర్వహించుకోవడం, సంబంధిత రంగంలో తమ ముద్రను వేసుకో వడం, అమ్మకాలను పెంచుకోవడం, వాటిని సొమ్ముగా రాబట్టుకోవడం, నిలకడగా నిరాటంకంగా చేసే వ్యాపారమే అభ్యుదయాన్ని తెచ్చి పెడుతుంది.
స్పష్టమైన అవగాహన, దార్శనికత, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో ముందుకు సాగిన వ్యాపారం నిలదొక్కుకుంటుంది. సంస్థ ఉత్పత్తులు లేదా సేవలు నిరంతరం విపణివీధిలో ఉండేట్లుగా జాగ్రత్తపడాలి. ఎంతటి సమర్థుడైనా వ్యాపారాన్ని ఒంటరిగా నిర్వహించుకోలేడు. ‘అన్నీ నేనే నిర్వహించుకోవాలి’ అనుకునే యజమాని విజయ సాధకుడు కాలేడు. వివిధ విభాగాలను నియమబద్ధంగా నడిపించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటుచేసుకొని వాటికి బాధ్యతలు అప్పగించిన నాయకుడు వ్యాపార విస్తరణకు సమయం కెటాయించ గలుగుతాడు.
సరైన ఉద్యోగులను నియమించుకోవడం నాయకుని దక్షతకు అద్దం పడుతుంది. సంబంధిత రంగంలో విజ్ఞానాన్ని, నైపుణ్యాలను కలిగిన వారిని, సకారాత్మక వైఖరి కలిగిన ఉద్యోగులను నియమించుకుంటే వారు సంస్థ స్వప్నాలను సాకారం చేయగలుగుతారు.
ఉత్తమ ఫలితాల కోసం..
ఉద్యోగులను ఎప్పుడు నియమించుకోవాలి? అవసరానుగుణంగా సమర్థత, నిబద్ధత కలిగిన ఉద్యోగుల నియా మకం ఉత్తమ ఫలితాల నిస్తుంది. పూర్తి సమయం పని లేకుండా నియమితుడైన ఉద్యోగివల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతుంది. అలాంటి సమయాలలో అవసరమైన కార్య నిర్వహణలను ఔట్సోర్స్ చేయడం ఉత్తమం. అలాగే, నాయకుడు ఎక్కువ కార్యాలను ఒకే సమయంలో నిర్వహించాల్సి వచ్చిన వేళ సమర్థులైన సహాయకులను నియమించుకుంటే పనిభారాన్ని తగ్గించుకొని ముఖ్యమైన వాటిపై దృష్టిని కేంద్రికరించవచ్చు.
వ్యాపారం ఎల్లవేళలా లాభాలనే ఇవ్వక పోవచ్చు. అప్పుడప్పుడు పరాజయమూ ఎదురుకావచ్చు. దానిని అంగీకరించే మానసిక స్థితి కలిగినవారే స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే, ఉద్యోగులకు, వినియోగదారులకు తమ శక్తి కొలది ఇవ్వగలగడం వ్యాపారాన్ని ఉన్నతీకరిస్తుంది. అది ద్రవ్యమే కానక్కరలేదు. గౌరవం కావచ్చు, విలువలు కావ చ్చు, గుర్తింపుకావచ్చు. రూపమేదైనా ఇవ్వడం అలవడితే అదే సత్ఫలితాల నిస్తుంది. అంతేకాదు, ఎవరైతే తనను తాను ఉన్నతంగా ఊహించుకొని ఆ మేరకు కృషి చేస్తారో వారే ఉన్నత స్థాయిని చేరుతారు. ‘నిన్ను నీవు గౌరవించుకోకపోతే నిన్ను గౌరవించే వారీ ప్రపంచంలో ఎవరూ ఉం డరు’. అందుకే నాయకుడు తనను తానెప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు. తన విలువను తగ్గించుకోనూ వద్దు.
అన్నింటికన్నా ముఖ్యంగా నాయకుడు నిరంతరం విద్యార్థిగా నేర్చుకుంటూ ఉండటం అత్యవసరం. వ్యక్తి నేర్చుకోవడం ఎప్పుడు ఆపేస్తాడో అప్పుడే అతని తిరోగమనం మొదలైనట్లుగా పెద్దలు చెప్తారు. మార్కెట్లో వస్తు న్న నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఎంత త్వరగా పట్టుకోగలిగితే అంత ఉన్నతికి చేరుకోగవడం సాధ్యమవుతుంది. ఒకప్పుడు వినియోగదారుడు దొరకడమే గొప్ప. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వినియోగదారుల ఆలోచనలూ మారాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎందరో వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులకై అంతర్జాతీయంగా చూస్తు న్నారు.
వినియోగదారుల అవసరాలను తీర్చగలిగిన వ్యాపార సంస్థలు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. అలాగే, వ్యాపార సంస్థల ఆలోచనలలోనూ మార్పులు వచ్చాయి. ఒకరి కొకరు సహకరించుకోవడం, వినియోగదారుల మనసులను గెలిచేందుకై నాణ్యతా ప్రమాణాలను పెంచుకోవడం, ఉత్పత్తులకు, సేవలకు అదనపు విలువలు కల్పించడం వంటివాటిపైనా వారు అధిక దృష్టి పెడుతున్నారు. ఫలితంగా నాణ్యత గలిగిన, నిజాయితీ గలిగిన వ్యాపార ఉత్పత్తులు అద్భుతమైన ఆదర ణను పొందుతున్నాయి.
పాలకుర్తి రామమూర్తి