calender_icon.png 4 October, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల్లో తప్పిన పెను ప్రమాదం..

04-10-2025 05:35:15 PM

* నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

* కాపాడిన రెస్క్యూ టీం, పోలీసులు

* నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

* డీఎస్పీ ప్రసన్నకుమార్ 

పాపన్నపేట (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో యువకులకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన 20 మంది యువకులు దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు చేరుకున్నారు. ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యాం అవతలి వైపు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అనంతరం స్నానం చేసేందుకు వినయ్, సాయి అనే ఇద్దరు యువకులు నదిలోకి దిగారు. ఈ క్రమంలో వినయ్ అనే యువకుడు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా మరో యువకుడు సాయి కాపాడేందుకు ముందుకు వెళ్లగా ఇద్దరు సైతం ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి నీటి మధ్యలో ఉన్న చెట్లను పట్టుకొని ఆగారు.

అక్కడ బిక్కు బిక్కు మంటూ ఉండగా తోటి స్నేహితులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ టీం, పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించగా డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జి, అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఫైర్, పోలీసు సిబ్బంది తాడు సాయంతో నదిలోకి దిగి ఇద్దరిని ఒడ్డుకు తీసుకువచ్చి సంబంధీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా యువకుల ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక, పోలీసు సిబ్బందిని తోటి స్నేహితులు, స్థానికులు అభినందించారు.

నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి..

డీఎస్పీ ప్రసన్నకుమార్ 

సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ డిఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనాల కోసం వచ్చే వారు నది ప్రవాహం వైపు వెళ్లొద్దని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు పాటించాలన్నారు. పోలీసు, క్యూఆర్టీ టీమ్, అగ్నిమాపక సిబ్బంది, తదితరులున్నారు.