calender_icon.png 25 June, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదురుతున్న వివాదం

04-12-2024 12:00:00 AM

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. కృష్ణదాస్‌పై దేశ ద్రోహం నేరం మోపిన పోలీసులు ఆయనను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కృష్ణదాస్‌ను తక్షణం విడుదల చేయాలంటూ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కృష్ణదాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు మంగళవారం ఆయన తరఫు లాయర్లు ఎవరూ హాజరు కావడంతో చిట్టగాంగ్ కోర్టు వచ్చేనెల 2కు వాయిదా వేసింది. అంటే మరో నెల రోజు ల పాటు కృష్ణదాస్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. వాస్తవానికి  కృష్ణదాస్ తరఫున వాదించాల్సిన న్యాయవాది రమణ్ రాయ్‌పై సోమవారం రాత్రి దాడి జరగడంతో ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారంటూ ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిసారు. ఆస్పత్రిలో రాయ్ మృత్యువుతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరఫున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని రాధారమణ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా  చిన్మయ్ ప్రభును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది ఆందోళనకారులు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలలోని బంగ్లాదేశ్ దౌత్యకార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.

అక్కడ ఉన్న తమ జాతీయ పతాకానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారని బంగ్లాదేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి త్రిపుర పోలీ సులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేయడంతో పాటుగా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. బంగ్లా డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయంపై దాడిని భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. కాగా తమ దౌత్య సిబ్బందికి భద్రత కల్పించలేకపోవడం భారత దేశ వైఫల్యంగా బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం విమర్శించింది. సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా స్నేహసంబంధాలు ఉండాలని తాము భావిస్తున్నామని బంగ్లా ప్రభుత్వం  న్యాయవ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఇది షేక్ హసీనా బంగ్లాదేశ్ కాదనే విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలన్నారు. దాడి నేపథ్యంలో  అగర్తలలోని బంగ్లాదేశ్ దౌత్యకార్యాలయంలో వీసా, కాన్సులర్ సేవలను తాత్కాలిక ప్రభుత్వం నిలిపి వేసింది. ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను విదేశాంగ శాఖ ఆఫీసుకు పిలిపించి అధికారికంగా నిరసన కూడా తెలియజేసింది. ఇటీవలి సంవత్సరాల్లో ఒక భారత దౌత్యవేత్త ను ఢాకా ఇలా పిలిపించి నిరసన తెలియజేయడం జరగలేదు. దీన్ని బట్టి షేక్ హసీనా ప్రధాని పదవినుంచి దిగిపోయిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతగా దిగజారాయో అర్థమవుతుంది.

మరో వైపు  భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 56 మంది ఇస్కాన్ సభ్యులను బంగ్లాదేశ్ అధికారులు సరిహద్దుల్లో ఆపేశారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉన్న దృష్ట్యా తమ గుర్తింపు తెలిసేలా తిలకం ధరించి బహిరంగంగా తిరగవద్దని బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ సభ్యులకు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. మరో వైపు బంగ్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్, అసోం తదితర రాష్ట్రాల్లో కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా గత వారం రోజులుగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను మోహరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్‌పై తప్పుడు వార్తలు ప్రసా రం చేస్తున్నందున భారతీయ టీవీ చానళ్లను నిషేధించాలని కోరుతూ ఢాకా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయింది. ఇవన్నీ ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా ఉన్నాయే తప్ప తగ్గించేవి కాదు. ఈ నేపథ్యంలో ప్రపంచమం తా బలమైన నేతగా గుర్తించిన ప్రధాని మోదీ కానీ, అటు నోబెల్ బహుమతి గ్రహీత అయిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ నేత మహ్మద్ యూనిస్ కానీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే బాగుంటుంది.