03-12-2024 12:00:00 AM
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు’ అని తరతరాల చరిత్ర నేర్పుతున్న నగ్న సత్యం. ఏ ప్రజాస్వామిక రాజ్యంలోనైనా రైతులు కష్టించి పండించిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలి. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతు వేషం కట్టి ప్రచారానికి వచ్చిన రాజకీయ నాయకులు రైతుపై వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తారు. దీనివల్ల రైతుకు ఒరిగేదేమీ లేదు.
రైతు తలుచుకుంటే ఎంతటి రాజ్య వ్యవసనైనా భూస్థాపితం చేసేంత శక్తివంతుడు. కాబట్టి రైతుకు ఎప్పుడూ ప్రభుత్వ అండదండలు ఉండాలి. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, ప్రతి రైతుకు ప్రతినెల రూ. 5 వేల పెన్షన్ ఇచ్చే విధంగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న వైనం మన ముందు కదలాడుతుంది.
అమలుకాని స్వామినాథన్ సిఫార్సులు
కనీస మద్దతు ధరల చట్టం దశాబ్దాలుగా రైతులు కంటున్న కల. ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువుకైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురుగులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. వంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందని డా. స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో చట్టబద్దత కల్పిం చాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10-15 వంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60-70 శాతం పొందగలుగుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందు తున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే 30 40 శాతం పొందుతున్నారు. కానీ మార్కెట్లో కిలో రూ. 50-75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10-20 శాతం కూడా దక్కని దుస్థితి నెలకొంది. రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 1977 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు.
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు మార్కెట్లో ధర లేని సమయంలో ’మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది. ప్రస్తుత వ్యవసాయదారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్య యనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తరహాలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్’ దిశగా అడుగులు పడాలి.
కనీస మద్దతు ధర
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అనేది ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ఎంపిక చేసిన పంటలకు కనీస ధర. ఇది సాధారణంగా విత్తనాలు/నాటడం సీజన్కు ముందు ప్రకటించబడుతుంది. ఎంఎస్ పీఅనేది 1960లలో వ్యవసాయ భూమి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి రైతులకు ప్రోత్సాహకంగా ఉండేది. అయితే 2000లలో ఇది మార్కెట్ జోక్యం , రైతు ఆదాయ పథకంగా పరిగణించబడుతోంది. అటువంటి ధరల విధానం ప్రభావం రాష్ట్రాలు ,వస్తువుల మధ్య విస్తృతంగా మారుతూ ఉంటుంది. ఎంఎస్పీ ఉనికి గురించి రైతులలో అవగాహన చాలా తక్కువగా ఉంది.
గోధుమ, వరి ఉత్పత్తులలో 20-25 శాతం మాత్రమే ఎంఎస్పీకి విక్రయించబడుతున్నాయి. భారత ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు సుమారు రెండు డజన్ల వస్తువులకు ధరను నిర్ణయిస్తుంది. వ్యవసాయ ఖర్చులు , ధరల కమిషన్ ( సీఏసీపీ) సిఫార్సులపై ఎంఎస్పీ నిర్ణయించబడుతుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద ధరల విధానానికి సంబంధించిన అపెక్స్ అడ్వైజరీ బాడీ అయిన సీఏసీపీ జాతీయ అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, రైతు వేతనాలు, జీవన వ్యయం , ఉత్పత్తి పోటీతత్వం వంటి విభిన్న అంశాలకు అనుగుణంగా ధరలను సిఫార్సు చేస్తుంది. అయినప్పటికీ అన్ని సిఫార్సులు ఆమోదించబడవు. రైతులకు మద్దతు ధర కల్పిస్తూనే, రాయితీ ఆహారాన్ని అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎం ఎస్పీ మద్దతు ఇస్తుంది. 20202021నాటి భారత రైతుల నిరసన ప్రధాన డిమాండ్లలో హామీ ఇవ్వబడిన ఎంఎస్పీ ఒకటి.
ఎంఎస్పీపై అవగాహన లేని రైతులు
1960లలో, భారతదేశం 1966-67 నాటి బీహార్ కరువు వంటి ఆహార కొరతను చూసింది. దీని ఫలితంగా కరువులు , యుద్ధం జరిగింది. ఆ దశాబ్దంలో భారతదేశంలో హరిత విప్లవం ప్రధాన సంవత్సరాల్లో , ఆహార ధాన్యాల కోసం ప్రభుత్వ ధరల విధానం సహా అనేక వ్యవసాయ విధాన వ్యూహాలు రూపొందించబడ్డాయి. వ్యవసాయ భూమి ఉత్పాదకతను పెంచడం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇది 1965లో వ్యవసాయ ధరల సంఘం ఏర్పాటుకు దారితీసింది. ముందుగా నిర్ణయించిన ధరల వద్ద సేకరణ, కనీస మద్దతు ధరలు , సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి పంపిణీ వ్యవస్థతో సహా అనేక ధర విధానాలను కమిషన్ ప్రవేశపెట్టింది.
ఈ సంస్థ 1985మార్చిలో కొత్త , విస్తృత సూచన నిబంధనలతో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ గా పునర్నిర్మించబడింది . అనేక ఇతర సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలతో పాటు కేంద్ర సంస్థతో సహా ఎంఎస్పీ అమలు చేసే ప్రక్రియలో పాలుపంచుకున్నాయి. ఇందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) , నేషనల్ అగ్రికల్చరల్ కో- ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉన్నాయి. ఈ మార్పుల ఫలితంగా గోధుమలు , బియ్యం వంటి ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. అదే సమయంలో ఈ ధరల విధానాల అమలు పక్షపాతంతోకూడుకున్నది కావడంతో వైవిధ్యీకరణపై దృష్టి తగ్గింది. పప్పులు, ఖాద్య తైలాలలో కొరత ఏర్పడింది.
2013 గణాంకాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలోని గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలోని 23 శాతం మంది రైతులకు మాత్రమే పంటల ఎం ఎస్పీ గురించి తెలుసు. 2018-19లో మొత్తం వరి విక్రయాలలో నాలుగింట ఒక వంతు, గోధుమలలో 20శాతం మాత్రమే ఎం ఎస్పీకి విక్రయించబడ్డాయి. ఏది ఏమైనా ఈ దేశంలో రైతు పడుతున్న కష్టాలు వర్ణాతీతం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం పట్ల నిరంతరం ఆలోచించి పకడ్బందీ ప్రణాళికలతో కూడిన రైతు శ్రేయస్సు పథకాలను తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగే రైతుకు తాను పండించిన పంట గిట్టుబాటు ధర రాక, ప్రకృతి వైపరీత్యాలు ఆకాల వర్షాలు సంభవించి ఆరుగాలం కష్టించిన పంటను కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ దేశంలో రైతు వ్యవస్థను మించిన సంస్థలు లేవు. కాబట్టి రైతు బాగుంటేనే ప్రజాస్వామిక రాజ్యం బాగుంటుంది.