03-02-2026 05:38:15 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉత్తర వాహిని పెద్దవాగు నది తీరాన ఉన్న 41 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం 15వ వార్షికోత్సవాన్ని మంగళవారం భక్తులు మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వఝల శిరీష్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మాడుగుల నారాయణమూర్తి, నిమ్మకంటి మహేష్ శర్మ, ఢిల్లీ విజయ్ కుమార్ లు స్వామివారికి స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ స్థాపన పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మాన్యుసూక్త హవనం చేసి పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
తదుపరి మంగళహారతి, మంత్రపుష్పం, మహదాశీర్వచనం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, భాజపా జిల్లా నాయకులు ఆరిగెల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, చిన్న మల్లేష్, మాజీ ఎంపీపీ బొమ్మెన బాలేశ్వర్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాపర్తి రవికుమార్, సీఐ బాలాజీ వరప్రసాద్ ,ఆలయ కమిటీ అధ్యక్షులు ధర్మపురి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండా వెంకన్న, కోశాధికారి పిన్న వివేక్తో పాటు కమిటీ సభ్యులు ఎకరాల శ్రీనివాస్, వనం మధు, డాక్టర్ రమేష్, సాయిని లక్ష్మణమూర్తి, రాజశేఖర్, గడ్డలు వెంకన్న, సుధాకర్, రాధాకృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.