calender_icon.png 17 June, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ములుగు డీఈవో

17-06-2025 12:00:00 AM

  1. ఉపాధ్యాయుడి రీజాయినింగ్ కోసం రూ.20 వేల డిమాండ్

డీఈవో పాణి, సీనియర్ అసిస్టెంట్ దిలీప్ అరెస్టు

సంగారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ములుగు, జూన్ 16 (విజయక్రాంతి)/మునిపల్లి: ఓ ఉపాధ్యాయుడి రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ములుగు డీఈవో పాణి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి గత సంవత్సరం ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికి గురై అక్టోబరు వరకు సిక్ లీవ్‌లో ఉన్నారు.

అనంతరం రీ జాయినింగ్ కోసం లక్ష్మీపురం హెచ్‌ఎంను సంప్రదించగా మూడు నెలలు గడిచినందున డీఈవో కార్యాలయం నుంచి ఆర్డర్‌కాపీ తేవాలని సూచించారు. సదరు ఉపాధ్యాయుడు డీఈవో కార్యాలయంలో రిపోర్ట్ చేయగా రూ.20 వేల లంచం ఇస్తేనే రీజాయినింగ్ ఆర్డర్ ఇస్తానని డీఈవో డిమాండ్ చేశారు. ఆర్డర్‌కాపీ తయారు చేసేందుకు డీఈవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.5 వేలు డిమాండ్ చేశాడు.

అందుకు అంగీకరించిన ఉపాధ్యాయుడు 2024 అక్టోబర్ నుంచి పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఆర్డర్‌కాపీ ఇవ్వలేదు. ఈ నెల జూన్ 12న కార్యాలయానికి వెళ్లగా లంచం ఇస్తేనే ఆర్డర్‌కాపీ ఇస్తామని అధికారులు చెప్పారు. తాను అంత ఇవ్వలేనని బతిమిలాడగా రూ.5 వేలు తగ్గించి ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు వరంగల్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

వారి సూచన మేరకు ములుగు డీఈవో కార్యాలయంలో సోమవారం రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు డీఈవో ఫాణిని, సీనియర్ అసిస్టెంట్ దిలీప్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సదరు ఉపాధ్యాయుడి ఫైల్ చెక్ మూమెంట్ చేయగా ఫిబ్రవరిలోనే జాయినింగ్ ఆర్డర్ సిద్ధం చేసి, లంచం కోసమే ఆపారని స్పష్టమవుతోందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.