7 July, 2026 | 9:15 PM

గోదామును పరిశీలించిన అడీషనల్‌ కలెక్టర్‌

07-07-2026 08:32 PM

– ఆర్మూర్‌లో సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌  సెంట్రల్‌ కిచెన్‌

ఆర్మూర్‌,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ సెంట్రల్‌ కిచెన్‌ ఏర్పాటుకు గోదాములను అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు, ట్రెయినీ ఐఏఎస్‌ పామూరు సురేష్‌ మంగళవారం పరిశీలించారు.

జిల్లాలో బోధన్, ఆర్మూర్‌ పట్టణాల్లో సెంట్రల్‌ కిచెన్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే జిల్లాలోని అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌ను సరఫరా చేయడానికి ఆర్మూర్‌ పట్టణం అనువుగా ఉండటంతో ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో గల గోదాములో తాత్కాలికంగా సెంట్రల్‌ కిచెన్‌ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు అధికారులు సాధ్యాసా«ధ్యాలను పరిశీలిస్తున్నారు.

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ గోదామును కేటాయించగానే ఫౌండేషన్‌ వారు పనులు ప్రారంభించి వీలైనంత త్వరలో పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోనున్నారు. వారి వెంట హరేకృష్ణ ఫౌండేషన్‌ నిర్వాహకులు సుచిత్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ ఆఫీసర్‌ గంగు, సమగ్ర శిక్ష సెక్టోరల్‌ ఆఫీసర్‌ పడకంటి శ్రీనివాస్‌రెడ్డి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీధర్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది మురళి తదితరులున్నారు.