14 July, 2026 | 5:33 PM

ఆరోగ్య సంరక్షణకు అధునాతన ఆవిష్కరణలు

14-07-2026 05:01 PM

గీతం చర్చాగోష్ఠిలో పేర్కొన్న స్వదేశీ, విదేశీ పరిశ్రమ నిపుణులు

పటాన్ చెరు: ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి అధునాతన మెటీరియల్స్, నూతన చికిత్సా పరిష్కారాల ఆవిష్కరణను రసాయన, జీవశాస్త్ర ఆవిష్కరణలు నడిపిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పదార్థాల నుంచి ఔషధాల వరకు రసాయన, జీవ శాస్త్రాల పాత్ర’ అనే అంశంపై మంగళవారం ఒకరోజు చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణ, బయోమెడికల్ సైన్సెస్ ను అభివృద్ధి చేయడంలో రసాయన, జీవ శాస్త్రాలు పోషిస్తున్న కీలక పాత్రపై చర్చించడానికి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమంలో పారిస్ లోని రెన్నెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రెన్ గ్రే, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ చాడ రాజిరెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో రసాయన, జీవ శాస్త్రాల ప్రధాన భూమికను వారు వివరించారు.

ప్రొఫెసర్ రెన్ గ్రే నూతన కైనేస్ ఇన్హిబిటర్ల ఆవిష్కరణ, ఔషధ రసాయన శాస్త్రంలో సుస్థిరతపై మాట్లాడారు. మానవ కైనోమ్ లో 538 ప్రోటీన్ కైనేసులున్నాయని, ఇమాటినిబ్, సోరాఫెనిబ్, సునిటినిబ్ సహా దాదాపు వంద ఎఫ్డీఏ ఆమోదిత ప్రోటీన్ కైనేస్ ఇన్హిబిటర్లు (పీకేఐలు) అందుబాటులో ఉన్నాయని, వాటిలో సుమారు 85 శాతం క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 400కు పైగా కైనేస్ ఇన్హిబిటర్లు క్లినికల్ అభివృద్ధి దశలో ఉన్నాయని, ఇది 9.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో, సుమారు 64 బిలియన్ల పౌండ్ల విలువైన వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కు ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. గీతం విశిష్ట ఆచార్యుడు, డీఎస్టీ పూర్వ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, శాస్త్రీయ ఆవిష్కరణలు వేగవంతం చేయడానికి, పరిశోధనలను అర్థవంతమైన సామాజిక ప్రయోజనాలుగా మార్చడానికి రసాయన, జీవ శాస్త్రాలతో పాటు పదార్థ విజ్జాన శాస్త్రాల మధ్య అంతర్ విభాగ సహకారాన్ని పెంపొందించాల్సి ఉందన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా మాట్లాడుతూ, అత్యాధునిక పరిశోధలను ప్రోత్సహించడానికి, అర్థవంతమైన శాస్త్రీయ పరస్పర చర్యలకు వేదికలను సృష్టించడంలో గీతం నిబద్ధతను చాటిచెప్పారు. సంక్లిష్టమైన శాస్త్రీయ, ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించడానికి బహుళ విభాగాల విధానాలను అవలంబించాలని ఆయన విద్యార్థులు, పరిశోధకులను ప్రోత్సహించారు. ఈ సెమినార్ లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పదార్థ విజ్జాన శాస్త్రం, ఔషధ రసాయన శాస్త్రం, జీవ పరిశోధనలలో అభివృద్ధి చెందుతున్న పోకడలపై నిపుణుల ఉపన్యాసాలు, ఆసక్తికరమైన చర్చల నుంచి వారు ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమాన్ని రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ గౌసియా బేగం, డాక్టర్ ఎ.రత్నమాల సమన్వయం చేశారు.