11-06-2025 06:23:21 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరం గురువారం నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాలయాల్లో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య(District Collector P. Pravinya) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ జిల్లా కలెక్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లోని వివిధ కోర్సులు, ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గురుకుల డిగ్రీ కళాశాలలో అందిస్తున్న కోర్సులలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యా బోధనతోపాటు కల్పిస్తున్న వసతులు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన అధ్యాపకులతో విద్యా బోధన, క్రీడలు, కెరీర్ గైడెన్స్, ప్రాంగణ ఎంపికలతో పాటు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానం ఉన్న వివరాలను తెలియజేస్తూ గురుకులాల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. గురుకులాల్లో వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
మడికొండ విద్యార్థినికి ఐఐటీ ఎంట్రన్స్ లో అత్యుత్తమ ర్యాంక్..
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని జి. సిందుజ జేఈఈ అడ్వాన్స్ లో అత్యుత్తమ ర్యాంకును సాధించినట్లు ప్రిన్సిపల్, జిల్లా సమన్వయ అధికారిణి ఉమామహేశ్వరి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఐఐటీలో ప్రవేశాలకు సంబంధించి 336వ ర్యాంకును సింధుజ సాధించినట్లు తెలిపారు. విద్యార్థిని సాధించిన ప్రతిభను తెలియజేస్తూ రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.