27-06-2025 12:16:52 AM
కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్ చెరు, జూన్ 26 : పటాన్ చెరు నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం సంగారెడ్డి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్ తో చర్చించారు.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. స్కూల్ ఏర్పాటు కోసం పటాన్ చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 69లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనం కోసం ఇదే సర్వే నంబర్ లో భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య త్వరలోనే భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు...
తమ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నూతన మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం, ఐనోలు, రామేశ్వరం బండ గ్రామాల ప్రజలు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన మున్సిపాలిటీల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రారం పీఏసీఎస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, శంకర్ రెడ్డి, మన్నె రాజు, రాజి రెడ్డి, బండి శంకర్, శంకర్ గౌడ్, మల్లేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య..
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించడంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి దత్తాత్రేయ నగర్ కాలనీలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రూ.2.50కోట్ల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సి ఎస్ ఆర్ హెడ్ రఘురామన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీలు స్వప్న శ్రీనివాస్, ప్రభాకర్, పిఎసిఎస్ చైర్మన్లు పాండు, బిక్షపతి పాల్గొన్నారు.