27-06-2025 12:15:14 AM
- రిపేరుకు డబ్బులు తీసుకొని పనిచేయని లైన్మెన్
- ప్రమాదకరంగా పరిస్థితి
- ఇబ్బందులు పడుతున్న సింగాటం గ్రామ రైతులు
గజ్వేల్, జూన్25: ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తో ఆరు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదు. గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో తిప్పారం మార్గంలోని చాకలి బాలరాజు పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఆన్ ఆఫ్ చేసేసి లేకపోవడంతో ప్రతినిత్యం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ తీగలు కిందికి వేలాడుతుండడంతో గాలికి విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తుతుంది.
ఈ ట్రాన్స్ఫార్మ్ప కనెక్షన్ ఉన్న 40 మంది రైతులు ఆరు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. లైన్మెన్ వేరే గ్రామంలో నివసిస్తుండడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యుజ్ పడిపోయినా, ఇంకా ఏమైనా సమస్యలు తలెత్తినా రైతులే మరమ్మతులు చేసుకోవడం అలవాటైపోయింది. గతంలో ట్రాన్సఫర్మర్ ఆన్ చేయడానికి వెళ్లి రైతు మృతి చెందడం, మరో రైతు అంగ వైఖల్యం పొందడం లాంటి సంఘటనలు ఈ గ్రామంలో చోటుచేసుకున్నాయి .
ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు తెగి గాలులకు ఊగడంతో పాటు, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లు తీగలు అల్లుకుపోయాయి. వర్షాకాలం సమీపించడం తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదంటూ రైతులు భయాందోళనకు గురవుతున్నారు.