15-06-2025 12:00:00 AM
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అమర్నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ శివ’ పేరుతో భద్రతా కార్యక్రమాలను ప్రారంభించింది. దక్షిణ కశ్మీర్ హిమాల యాలలో 3,880 మీటర్ల ఎత్తులోని పవిత్ర అమర్నాథ్ గుహ మందిరానికి దారితీసే తీర్థయాత్ర మార్గానికి పూర్తి భద్రతా కవరేజీని అందించడం లక్ష్యంగా భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమమే ‘ఆపరేషన్ శివ’ లక్ష్యం.
ఈ సంవత్సరం యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. ఇది 38 రోజులపాటు ఉంటుంది. ఇది గత సంవత్సరం 52 రోజుల షెడ్యూల్ కంటే తక్కువ రోజులను కేటాయించారు. అపూర్వమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా, యాత్ర కాన్వాయ్ కదలిక సమయంలో దానిని రక్షించడానికి మొదటిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాన్వాయ్కి కేంద్ర సాయుధ పోలీసు దళాలు రక్షణ కల్పిస్తాయి. యాత్ర మార్గాలు, జాతీయ రహదారులకు దారితీసే అన్ని రహదారులను గరిష్ట భద్రతను నిర్ధారించడానికి తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు.
దాచిన పేలుడు పదార్థాలు, ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను గుర్తించి తటస్థీకరించడానికి జ మ్మూ కశ్మీర్ పోలీసుల సమన్వయంతో దాదాపు 50,000 మంది పారామిలిటరీ సిబ్బంది రోజువారీ రోడ్ ఓపెనింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఏదైనా ముప్పు కు త్వరగా స్పందించడానికి సున్నితమైన ప్రదేశాలలో క్విక్ రియాక్షన్ టీమ్లు కూడా మోహరించి ఉంటాయి. అనంతనాగ్లోని సాంప్రదాయ పహల్గామ్ మార్గం, గండేర్బాల్లోని చిన్న బాల్తాల్ మార్గం రెండింటిలోనూ బహుళ- లేయర్డ్ భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
యాత్ర పొడుగునా భద్రతా దళాలు ఈసారి మరింత అత్యున్నత స్థాయి అప్రమత్తతను కొనసాగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. యాత్రికుల కేంద్ర వసతి సౌకర్యమైన యాత్రి నివాస్ వద్ద ఏర్పాట్లను పరిపాలన, పోలీసులు, పారామిలిటరీ దళాల సీనియర్ అధికారులు ఇప్పటికే సమీక్షించారు.
13 ఏళ్లలోపు లేదా 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భి ణీ స్త్రీలు తప్పనిసరి వైద్య ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నప్పటికీ యాత్రకు అనుమతించబడరని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు పునరుద్ఘాటించింది. ప్రతీ సంవత్సరం, అమర్నాథ్ యాత్ర భారతదేశం అంతటా లక్షలాదిమంది భక్తులను ఆకర్షిస్తుంది. హిమాలయాలలోని అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వారంతా ఎంతో ఉబలాటపడతారు.
ఇందుకోసం అత్యంత కష్టతరమైన ఎత్తయిన పర్వతారోహణకు, ఇంకా ఉగ్రవాదుల భయాందోళనలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి యాత్రికులు సిద్ధపడతారు. అయితే, ఈ సంవత్సరం యాత్ర కేవలం మతపరమైన కార్యక్రమం కాదు, ఇది భారతీయ ధార్మిక స్థితిస్థాపకతకు ఒక సందేశంగానూ భావించవలసి ఉంది. ఇదే స్ఫూర్తి భారత సైన్యంలోనూ కొనసాగుతోంది. “మేం మీ ఊకదంపుడు, ఉన్మాదపూరితమైన ఉగ్రవాదానికి భయపడం” అని ‘ఆపరేషన్ శివ’లో పాల్గొన్న ఒక సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.