21-01-2026 12:14:24 AM
ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాత్ కుమార్
పటాన్ చెరు, జనవరి 20: ప్రకృతి, భౌతికశాస్త్రం నుంచి ప్రేరణ పొందిన ఆప్టిమైజేషన్ సూత్రాలు తక్కువ ఖర్చుతో కూడుకున్న, సమర్థవంతమైన నిర్మాణ డిజైన్లకు దారితీస్తాయని ఐఐటీ హైదరాబాదులోని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘టోపాలజీ ఆప్టిమైజేషన్ సిద్ధాంత, ఆచరణ’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇంజనీరింగ్ డిజైన్, దాని సైద్ధాంతిక పునాదులు, ఆచరణాత్మక ఔచిత్యాన్ని వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో వాస్తవ ప్రపంచ వినియోగాన్ని కూడా ప్రస్తావించడంతో పాటు, తగ్గిన పదార్థ వినియోగం, తక్కువ కార్యాచరణ ఖర్చులు, మెరుగైన సౌందర్యం అవసరమన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ రాబర్ట్ లె రికోలైస్ ను ఉటంకిస్తూ, ‘నిర్మాణ కళ అనేది రంధ్రాలను ఎక్కడ పెట్టాలో తెలుసుండాలని, ఇది నిర్మాణ పనితీరులో మెటీరియల్ లేఅవుట్, కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వడాల, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ అక్తర్ ఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సమన్వయకర్త డాక్టర్ నికుల్ జాని తదితరులు పాల్గొన్నారు.