07-06-2025 12:07:52 AM
శ్రీనగర్, జూన్ 6: భారతీయ రైల్వేలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శతాబ్దాలుగా కశ్మీర్ ప్రజలు ఎదురు చూస్తున్న కల నేటితో సాకారమైంది. ప్రపంచంలోనే అత్యం త ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అత్యంత కఠినమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చడం విశేషం.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం జమ్మూ కశ్మీర్ పర్యటనకు తొలిసారి వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 46 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం ఉధంపూర్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా చినాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. ప్రారంభానికి ముందు చినాబ్ వంతెనను పరిశీలించిన మోదీ ఆ తర్వాత జాతీయ జెండాను ఊపి వంతెనను ప్రారంభించారు.
అనంతరం శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు రెండు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇక దేశంలోనే తొలి రైల్వే కేబుల్ ఆధారిత బ్రిడ్జి అయిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్ రైలులో మోదీ ప్రయాణించారు. కార్యక్రమంలో మోదీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణంలో భాగమైన అంతర్జాతీయ కంపెనీలు
చినాబ్ వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను వీఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించారు. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు అప్పగించారు.
ఇక పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. దీని నిర్మాణంలో కేంద్ర రక్షణ సంస్థ డీఆర్డీవో కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్కు చెందిన డబ్ల్యూఎస్పీ గ్రూప్ వయాడక్ట్, ఫౌండేషన్లను రూపొందించగా..జర్మనీకి చెందిన లియోన్ హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్ను రూపొందించింది.
పర్వత శ్రేణుల వాతావరణం తట్టుకునేలా
కాట్రా నుంచి శ్రీనగర్ మధ్య ప్రయాణించే వందేభారత్ రైళ్లు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే వాతావరణాన్ని తట్టుకునే రీతిలో రైలు బోగీలను తయారు చేయడం విశేషం. వాటర్ ట్యాంకులు, బయో టాయిలెట్ల కింద సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను అమర్చారు. దీని వల్ల మైనస్ ఉష్ణోగ్రతల్లోనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండే రీతిలో కశ్మీర్ వందే భారత్ రైలును సృష్టించారు. మైనస్ ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు 5కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయడం విశేషం.
11 నెలల్లోనే పూర్తి..
భారత్లోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనగా గుర్తింపు పొందిన అంజిఖాడ్ వంతెనను అంజి నది వద్ద నిర్మించారు. ఈ వంతెన నదీగర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో, 725 మీటర్ల పొడవుతో నిర్మించారు. దీనికి 96 హైటెన్సైల్ కేబుల్స్ను, విలోమ వై ఆకారంలో నిర్మించిన వంతెనలో 653 కిమీ కేబుల్ స్ట్రాండ్లు ఉన్నాయి. ఇంజినీరింగ్ నైపుణ్యంగా పేర్కొంటున్న అంజీ వంతెన నిర్మాణం కేవలం 11 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.
359 మీటర్ల ఎత్తులో
ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకొనే చినాబ్ రైల్వై వంతెనకు చాలా ప్రత్యేకతలున్నాయి. రైలు మార్గం ద్వారా కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా (యూఎస్బీఆర్ఎల్) రైల్వే ప్రాజెక్టులో ఈ చినాబ్ వంతెన ఒక భాగం. చినాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన వంతెన పొడవు 1315 మీటర్లు కావడం విశేషం.
ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తాజాగా చినాబ్ వంతెన అధిగమించింది. గంటకు 260 కిమీ వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు.
ఈ బ్రిడ్జిని నిర్మించడానికి 28,660 మెగాటన్నుల ఉక్కును వినియోగించారు. ఈ వంతెన జీవితకాలం దాదాపు 120 ఏళ్లు అని ఇంజినీర్లు పేర్కొన్నారు. పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. దీనిపై ఒక రైలు గరిష్ఠంగా 100 కిమీ వేగంతో వెళ్లే అవకాశముంది.
1.31 కిమీ మేర విస్తరించిన చినాబ్ వంతెన నిర్మాణానికి కేంద్రం సుమారు రూ. 1486 కోట్లు ఖర్చు చేసింది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా 23 ఏళ్ల తర్వాత పూర్తవ్వడం గమనార్హం. ఈ వంతెన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో కీలకమైన భాగం.
కశ్మీర్ టు కన్యాకుమారి
శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా, శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభంతో భారతీయ రైల్వే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం అనుసంధానం లేదు. తాజాగా ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా (యూఎ స్బీఆర్ఎల్) ప్రాజెక్టులో భాగంగా 272 కిమీ రైల్వే లైన్ నిర్మాణంతో కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం అనుసంధానించి నట్టయింది. దీనిద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు లింకు ఏర్పాటు చేసినట్టయింది. ఈ మార్గం ద్వారా కత్రా-శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గనుంది. ప్రయాణికులు అత్యాధునిక వందేభారత్ రైలు ద్వారా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే మార్గం అంచనా వ్యయం రూ. 43, 780 కోట్లుగా పేర్కొన్నారు. ఈ మార్గంలో 119 కిలోమీటర్ల పొడవైన 36 ప్రధాన సొరంగాలు ఉన్నాయి. ఇందులో టీ-49 సొరంగం 12.77 కిమీ పొడవుతో దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగంగా నిలిచింది.