07-06-2025 01:28:20 AM
శ్రీనగర్, జూన్ 6: పహల్గాంలో టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జరిపిన దాడి మానవత్వంపై, కశ్మీరియత్పై జరిగిన దాడిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్లో మత కల్లోలాలు సృష్టించాలని, టూరిజంపై ఆధారపడి జీవించే కశ్మీరీలను దోచుకోవాలని పాకిస్థాన్ కుట్ర పన్నిందని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని ప్రధాని తెలిపారు.
మానవత్వానికి, పర్యాటకానికి పాకిస్థాన్ వ్యతిరేకమని విమర్శించారు. శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తున చినాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన మోదీ అనంతరం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ధైర్య సాహసాలకు జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రతీకగా నిలిచారు. ఉగ్రదాడి జరిగినప్పటికీ ఏ మాత్రం బెదరని అక్కడి ప్రజలు దానిని ధైర్యంగా ఎదుర్కోవడం ప్రశంసనీయం.
పాకిస్థాన్ పర్యాట కానికి వ్యతిరేకం అని చెప్పడానికి ఉదాహరణే పహల్గాం ఉగ్రదాడి ఘటన. ఆదిల్ హుస్సేన్ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా. తన కుటుం బాన్ని పోషించేందుకు కష్టపడే అతడు పహల్గాం ఉగ్రదాడిలో ముష్కరులతో పోరాడాడు. కానీ అతడిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ప్రశాంతంగా ఉన్న మన దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రదాడులకు పాల్పడ్డారు.
మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని పాకిస్థాన్ చూస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. పాక్ కుయుక్తులను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. ఉగ్ర కుట్రలకు ధీటుగా బదులిస్తున్నాం. ‘ఆపరేషన్ సిందూర్’తో మన శక్తి ఏంటో చూపించాం.
పొరుగు దేశంలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. భారత త్రివిధ దళాలు మే 6న పాక్కు ధీటైన సమాధానం ఇచ్చి తగిన గుణపాఠం చెప్పాయి. పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని మాత్రం అడ్డుకోలేరు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
చిరకాల స్వప్నం నెరవేరింది
అంతకుముందు చినాబ్ వంతెన ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించుకోవడం ద్వారా చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఎత్తున వంతెన నిర్మించి భారత్ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టామన్నారు. భారత ఇంజినీరింగ్ నైపుణ్యానికి చినాబ్ వంతెన ప్రతీక అని వెల్లడించారు.
ఈ వంతెన నిర్మాణంతో జమ్మూ కశ్మీర్ ప్రాంతం పర్యాటకంలో మరింత ఆకర్షణగా మారనుందని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మాతా వైష్ణోదేవి ఆశీర్వాదంతో అది సాధ్యమైందన్నారు. ఇవాళ్టితో భారత రైల్వే నెట్వర్క్తో కశ్మీర్ కూడా అనుసంధానమైందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి అనేది వాస్తవ రూపంలోకి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం అనేక తరాలు ఎదురు చూశాయని, సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తన 8వ తరగతి నుంచే ఈ ప్రాజెక్టు కోసం కలలు కన్నారని తెలిపారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం అది నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.