19 August, 2026 | 4:40 PM

పాత వీడియోను కొత్త ఘటనగా ప్రచారం చేస్తున్నారు

19-08-2026 04:08 PM

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు

భూపాలపల్లి,(విజయక్రాంతి): తనకు సంబంధించిన పాత వీడియోను ఎడిట్ చేసి, నిన్నటి ఘటనగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. బుధవారం భూపాలపల్లిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌సీ భూపాలపల్లి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వాస్తవాలను వక్రీకరిస్తూ వీడియోను పోస్టు చేశారని తెలిపారు. మార్చి 10న యూనివర్సిటీ క్రాస్‌ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని, ఆ ఘటనపై ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదై కేసు కోర్టు పరిధిలో ఉందని వివరించారు. పాత ఘటనలను కొత్తవిగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.

తనపై, నాయకులు, కార్యకర్తలపై అసత్య ప్రచారం కొనసాగితే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు సహజమేనని, వ్యక్తిగతంగా కించపరిచేలా తప్పుడు వీడియోలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, జిల్లా నాయకులు సెగ్గెం సిద్దూ, మాడ హరీష్‌రెడ్డి, పిన్నింటి శ్రీనివాస్‌రావు, సింగణవేణి చిరంజీవి, మాజీ కౌన్సిలర్ మురళీ హఫీజ్, గాజర్ల చింటూ గౌడ్, మామిండ్ల సాంబయ్య, పిన్నింటి మణిదీప్‌రావు, మహేందర్, పబ్బ రవీందర్, మార్క సాయిగౌడ్, వాజీత్ తదితరులు పాల్గొన్నారు.