27-12-2025 12:22:48 AM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కోదాడ, డిసెంబర్ 26: పోలీసుల కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. రాజేష్ మృతికి దారితీసిన పరిస్థితులను ఆయన తల్లి లలితమ్మను అడిగి తెలుసుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను ఓదార్చుతూ, న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఘటనపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారని, మిగిలిన వారిపై కూడా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 4,12,000 చెక్కును బాధిత కుటుంబానికి నేడు అందజేయడం జరిగిందని మిగిలిన మొత్తాన్ని త్వరలోనే అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నివసించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 70 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ లపై దాడులు జరగడం అమానుషం అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు రాజేష్ మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించారు.
ఈ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, వడ్డేపల్లి కోటేష్, కర్ల సుందర్ బాబు, అశోక్, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.