27 February, 2026 | 3:05 AM

ఈడీ ఎదుట అనిల్ అంబానీ

27-02-2026 01:01 AM

ముంబైలోని రూ.3,716 కోట్ల ఇంటిని సీజ్ చేసిన ఈడీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: మనీలాండరింగ్, బ్యాంకు రుణ మోసాల కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు హాజరయ్యారు. కాగా బుధవారం ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన నివాసం ‘అబోడ్’ను ఈడీ జప్తు చేయడం గమనార్హం. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న 17 అంతస్తుల ఈ భవనం విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా.

అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్‌నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. తాజా వాటితో కలిపి ఈ కేసులో మొత్తం అటాచ్‌మెంట్ విలువ రూ.15,700 కోట్లకు చేరింది. అనిల్ అంబానికి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది.

ముంబయి లోని అనిల్ అంబానీ ఇంట్లో, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఒకవైపు అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరైన నేపథ్యంలో సోదాలు జరగడం విశేషం. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. రూ.2,220 కోట్ల రుణ మోసం కేసులో నిర్వహించినట్లు సమాచారం.