12-01-2025 12:00:00 AM
మాడభూషి శ్రీధర్ :
“నిన్నే కోరుకున్నాం. మాకే ఉపాయాలూ తెలియదు. నిన్నే ఉపాయంగా నమ్ముకుని వచ్చాం. మాకే యోగ్యతా లేదు. మా జాతిలో నీవు పుట్టడమే మా బలం. నలుగురితో కలిసి భగవత్ గుణానుసంధానం చేయడమే ఆనందదాయకం” అంటున్నారు.
లోపమనేదే లేని గోవిందా(కుఱవొన్ఱుమిల్లాద గోవిందా), మేము(యామ్), పశువుల వెంట నడిచి(కఱవైగళ్ పిన్ శెన్ఱు), అడవిలో కలుసుకుని(కానమ్ శేర్ న్దు), తిని తిరుగుతూ ఉంటాం(ఉణ్ బోమ్), ఏ మాత్రం వివేకం లేని(అఱివు ఒన్ఱుమ్ ఇల్లాద), యాదవ కులంలో(ఆయకులత్తు), నిన్ను (ఉన్ దన్ను), మా వంశంలో పుట్టిన(ప్పిఱవి పెఱుందనై), పుణ్యాన్ని(పుణ్ణియమ్), పొంది వున్నాము(ఉడైయా మ్), ఓ దేవా(ఇఱై), నీతో మా సంబంధం (ఉన్ దన్నోడు ఉఱవు), ఇక్కడ మనకు(ఇంగు నమక్కు), పోగొట్టుకుందామన్నా పోయేది కాదు(ఒజిక్క ఒజియాదు), లోకజ్ఞానం లేని పిల్లలం(అఱియాద పిళ్లైగళోమ్), నిన్ను(ఉన్ దన్నై), ప్రేమతో (అన్బినాల్), చిన్నపేరుతో పిలిచినందుకు(శిరుపేర్ అజైత్తనవుమ్), నీవు (నీ), కోపించి అనుగ్రహించకుండా వదలకు (శీఱి అఱుళాదే), మేము ఆశించిన ప్రయోజనా న్నిమ్ము(పఱైతారాయ్).
యాదవులు అమాయకులు, ప్రకృతితోనూ సహజ సిద్ధమైన పశుపక్ష్యాదులతోనూ నిష్కల్మష స్నేహం చేసేవారు, నోరు లేని జీవులు, మనను పాలిచ్చి పోషించే తల్లుల వంటి పశువులే సంపద, పశువులే స్నేహితులు. అమ్మ తరువాత మనకు తమ శరీరంలో భాగమైన పాలను పంచుకునేది పశువులే కదా. అవి పశువులా? తల్లులనుకోవలసిందే.
వాటిని మనుషులతో సమానంగా ప్రేమించే అమాయత్వాన్ని మించిన దైవత్వం లేదు. పాడి పశు వులను బంధువులుగా భావించి సేవించే గొల్లవారికి శారీరక శుచి శుభ్రత తక్కువని అను కుంటారేమో. మాకు ప్రకృతితో సమాగమమే దైవ సన్నిధానం అని పైకి చెప్పడం కూడా రాదు. వారి జీవనంలో అదొక భాగం, అంతే.
పశువులకు గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని అక్కడికి వాటిని తోలుకు పోవడం వారి పని. వాటితోనే ఉంటారు, వాటితోనే కలిసి తెచ్చుకున్న సద్దిమూట విప్పి తింటారు. ఇన్ని లోపాలున్న మాతో ఏ లోపం లేని గోవిందు డు కలిసి తిరుగాడినాడంటే ఎంత ఆనందం, ఎంత అదృష్టం. యాదవ కులం మొత్తం పర మ పావనమైంది, యుగయుగాల దాకా.
కృష్ణుడు యోగులకు కూడా అందనంత ఎత్తు న ఉన్నాడని వారికి తెలియదు. తమకు అందుబాటులో తమతో ఉన్న సులభుడనీ తెలియ దు. కనుక చిన్ననాటి మిత్రుడిని పిలిచినట్టు, ‘రారా పోరా’ అని చిన్న చిన్న మాటలతో పిలుచుకున్నామని అంటున్నారు. లౌక్యం తెలియని చిన్న వారమయ్యా, కోపం రాలేదు కదా.
చిన్నబుచ్చు కోలేదు కదా.‘నీతో సహవాసమే, నీతో చెరగని స్నేహమే మాకు తరగని పెన్నిది కన్న య్యా’ అంటున్నారు గోల్లవారు గోపికలు, బాలికలు. గోవులు, ఆబాల గోపాలం, అదేమాట. ఇదే ఈ రోజు పాట, గోదమ్మ నోట. కన్నయ్య వారితో మాట్లాడుకుంటున్న మాటలివి.
శ్రీకృష్ణ: నామీద భక్తి కుదరాలంటే వేల ఏళ్లపాటు కర్మ భక్తి మార్గాలలో ఒక్కటైనా మీరు అనుష్టించి ఉండాలి కదా, అదేమైనా ఉందా?
గోపికలు: మా తెలివి నడవడికలు చూస్తే కర్మ భక్తి మార్గాలలో ఒకటైనా ఉంటుందనే అనుమానం వస్తుందా అసలు. మాకు జ్ఞానం ఎక్కడిది? పుట్టినప్పటి నుంచి పశువులే మాకు బంధువులు, మిత్రులు. వాటి వెంట అడవుల్లో తిరిగేవాళ్లం.
శ్రీకృష్ణ: అడవుల వెంట తిరిగినా సరే, ఏవైనా పుణ్యక్షేత్రాల్లోనైనా ఉన్నారా? కనీసం ఆ కారణం మీదైనా మీ కోరికలు తీర్చవచ్చు.
గోపికలు: పశువులకు గడ్డి మేయడానికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఆగుతాం. అదే మాకు పుణ్యక్షేత్రం. అయినా, అడవుల్లో కర్మయోగాదులు చేయడానికి ఏ సౌకర్యాలుంటాయి! ఆ ప్రసక్తే లేదు.