calender_icon.png 18 July, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తును ఎదుర్కోవడంలో ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలి

17-07-2025 06:25:37 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుండి ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో 142 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్సిసి వాలంటీర్లకు బీసీ స్టడీ సర్కిల్లో 12 రోజులపాటు ఆపదమిత్ర శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆపదమిత్ర వాలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

ఈ ప్రమాదాలు ఎదుర్కునేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు మొదటి విడతలో ఆపద మిత్ర శిక్షణ ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో డిగ్రీ విద్యార్థులు, ఎన్సీసీ వాలంటీర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు. శిక్షణలో భాగంగా ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి విపత్తునూ ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క పాటు, అగ్నిప్రమాదం, సిపిఆర్, షాట్ సర్క్యూట్, వరదలు,  రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండి ప్రజల ప్రాణాలను రక్షించాలని అన్నారు. 

నైపుణ్యాలతో కూడిన ఆపదమిత్ర శిక్షణ వల్ల తమను రక్షించుకోవడంతో పాటు పది మంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన వారు నేర్చుకున్న నైపుణ్యాలను, మెళకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావచ్చని, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలోనూ ఆపద మిత్రులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.