10-12-2025 02:38:14 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని, వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మంగళవారం హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ అదే రోజు రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుందని తెలిపారు. ఈ పరీక్షకు దాదాపు 4వేల మంది న్యాయవాదులు హాజరవుతున్నారని, పరీక్షా కేంద్రాలు హైదరాబాదులో ఉండగా అభ్యర్థుల ఓట్లు వారి సొంత గ్రామాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా పరీక్ష ఉండటంతో, అభ్యర్థులు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హ క్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలని, పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్ కు దూరం చేయడం అన్యాయమన్నారు. తక్షణమే రాష్ర్ట ప్రభు త్వం విషయంపై స్పందించి, ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. న్యాయవాదులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు.