calender_icon.png 14 September, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాలపై ఉత్తుత్తి హామీలేనా?

14-08-2024 12:30:00 AM

నిరుద్యోగం ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. గతం, వర్తమా నం, భవిష్యత్తులో ఎక్కడా ఈ నిరుద్యోగ సమస్య మనలను వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది. పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండికూడా పని దొరకక పోవడమే నిరుద్యోగం. అలా అని సామర్థ్యం, పని చేయా లని ఆలోచన ఉండి, అంగవైకల్యంతో ఉన్నవారు నిరుద్యోగులు మాత్రం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ నిరుద్యోగం సమస్యగానే ఉంది.

పట్టించుకోని బీఆర్‌ఎస్ సర్కార్

‘నిరుద్యోగం’ సమస్యకే ఒక పెద్ద సమ స్య. దీనివల్ల కొందరు నక్సల్స్‌గా, మరికొందరు సంఘ విద్రోహులుగానూ మారుతు న్నారనే వాదన ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతో ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియామకాలపై పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. నీళ్లు ఇచ్చారు, నిధులు కోసం పాటు పడ్డారు. కానీ, కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ కట్టడి యత్నాలు ఏ మాత్రం చేయలేదు. ప్రతి రాజకీయ పార్టీకి నిరుద్యోగం ప్రధాన అజెండా అయిపోయింది.

ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగమంత్రం ప్రతి రాజకీయ పార్టీ వదులుతూనే ఉంది. బీఆర్‌ఎస్‌పై నిరుద్యోగులకు నమ్మకం సన్న గిల్లింది. ఉద్యోగాల విషయంలో ఆ పార్టీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ, పేపర్ లీకేజీలు, పరీక్ష నిర్వహణ లోపం నిరుద్యోగుల్లో మరింత అసంతృప్తిని పెంచింది.  బీజేపీ, కాంగ్రెస్‌సహా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు బీఆర్‌ఎస్ తీరును విమర్శించారు. 

కొన్ని పార్టీలు అయితే నిరుద్యోగుల కోసం మార్చ్‌లు కూడా చేశాయి. ‘నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం, కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా మోసం చేసిందని’ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు లేవనెత్తాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రధాన అజెండా నిరుద్యోగమే అవడంతో తమకు పార్టీలు అండగా ఉంటాయన్న ధైర్యం వచ్చింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు.

దీంతో నిరుద్యోగులు అనుబంధ సంఘాలతో కలిసి గ్రామాలకు వెళ్లి డిక్లరేషన్ గురించి ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును జనానికి అర్థమయ్యేలా చెప్పారు. ‘బీఆర్‌ఎస్ సర్కార్ మనకి నీళ్లు, నిధులు, పెన్షన్లు ఇస్తున్నది. కానీ, మన ఉద్యోగాలు మనకు రావడం ముఖ్యం’ అని నిరుద్యోగులు విస్తృతంగా భావవ్యాప్తి జరిపారు. ‘ధర్నాలు, నిరసనలతో విసిగిపోయాం. ఇక ఉద్యోగాల సాధనే మన లక్ష్యం’ అని నిర్ణయించుకున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో అలా వాళ్లంతా కీలకమయ్యారు.

పునరావృతమైన అదే పరిస్థితి

ఎన్నికల తర్వాత సీన్ మళ్లీ రిపీట్ అయింది. కాంగ్రెస్ హామీల్లో భాగంగా గ్రూప్ పోస్టులు పెంచి, డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఈ ప్రభుత్వమైనా స్పష్టత ఇవ్వకపోతే ఎలా? యువత మరింత కాలం నిరుద్యోగులుగా ఉండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐనా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ ధర్నాలు, ఆందోళనలు చేయకూడదని అనుకున్నామో మళ్లీ అవే ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ‘అసలు నిరుద్యోగమే ఉద్యోగంగా, ధర్నా లు- నిరసనలు చేయడమే మా పనిగా అయిపోయింది. మళ్లీ దీనిపై ప్రతిపక్షాలు మా సమస్యను తీర్చాలని మొక్కుబడిగా చెప్తున్నారు గానీ, సమస్యలకు పరిష్కారం మాత్రం వచ్చేలా చూడటం లేదు. మళ్ళీ వాళ్ళ అధికారానికి మేము ఏ విధంగా ఉపయోగపడతామన్న ఆలోచన చేస్తున్నారు’. నిరుద్యోగులను ఈజీగా మోసం చేయొచ్చు. అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి, తరువాత మభ్యపెడితే సరిపోతుందిలే అన్న భావనతో రాజకీయ పార్టీలు ఉన్నాయి. 

పలువురు ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు కూడా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. చదువుకున్నవారు సులభంగా మోసపోవడం బాధాకరమని వారు అంటున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసి, పరీక్ష నిర్వహణలో లోపం రావడం ఒక ఘటన అయితే, డిక్లరేషన్ పేరుతో ఇప్పటి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం మరో చరిత్ర. ‘మా న్యాయమైన పోరాటంపై ప్రభుత్వం బుర ద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని’ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రశ్నిస్తే గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని’ నిరుద్యోగులు మండి పడుతున్నారు.

నిరుద్యోగులే ఆత్మ పరిశీలన చేసుకోవాలి

నిరుద్యోగుల గోసను చూసి కొందరు మేధావులు, విద్యావంతులు పలు రకా లుగా మాట్లాడుతున్నారు. ఇంత టెక్నాలజీ కాలంలో ఇంకా నిరుద్యోగం అంటూ ప్రభుత్వాలు వస్తున్నాయంటే, చదువుకున్న నిరుద్యోగులదే తప్పంటున్నారు మేధావులు. పార్టీలు పదవిలోకి రావడం కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకోవడం సాధారణమైందని అంటున్నారు విద్యావంతులు. నిరుద్యోగులు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు? గత ప్రభుత్వంలోని తప్పులు ఇప్పటి ప్రభుత్వంలో కూడా రిపీట్ అవుతున్నాయి.

‘అసలు ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాల లెక్కల్లో నిజమెంత? రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయా? ఉంటే, చూపించాలి? లేకపోతే ఎలా ఇస్తామంటున్నారు?’ అనే దానిపై నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని విద్యావంతులు అంటున్నారు. ‘నిరుద్యోగులకు నిరుద్యోగమే ఉద్యోగం. ధర్నాలు, ఆందోళనలే వాళ్ళ పని’ అన్నట్టుగా ఉన్న పార్టీల వ్యవహార తీరును నిరుద్యోగులు తెలుసుకోలేక పోతున్నారని వారు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వాలు కాలయాపన చేసి నిరుద్యోగితను పరోక్షంగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని నిరుద్యోగులు ఎదుర్కొనే పరిస్థితి లేదు, రాదని వారంటున్నారు.

సొంతంగా సృష్టించుకోలేమా!

“నిరుద్యోగం పెరిగిందా? తగ్గిందా? ఎంత శాతం ఉంది? అనేది పక్కన పెడితే, అసలు నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడం మాత్రమే. అంతేగాని, అంతా కోల్పోయామని కాదు. చదువుకు అనుగుణంగా మన ఉద్యోగాలను మనమే క్రియే ట్ చేసుకునేలా ఈ టెక్నాలజీ కాలంలో చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగినవారు ఉన్నారు. ఇదే నిరు ద్యోగితపై ఉద్యోగంలో ఉంటూ పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వాలపై ఎంతకాలం ఆధా రపడి పోరాటం చేసినా కాలం ఖర్చవుతుందే తప్ప ప్రభుత్వాల తీరులో ఏ మాత్రం మార్పు రాదు. మన దేశంలోనే వ్యక్తులు కొందరు పక్క దేశాలకు వెళ్లి అక్కడ తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని సంతోషంగానే ఉన్నారు.

వాళ్ళు ఏ ప్రభు త్వ ఉద్యోగాలపై ఆధార పడలేదు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వదులుకోలేదు. ఇప్పటి పరిస్థితుల్లో మనకున్న సామర్థ్యంతో ఏదో ఒక పని చేసు కుంటూ ప్రభుత్వ ఉద్యోగాలపై సమయా న్ని కేటాయించి పోరాటం చేస్తే కచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది” అంటున్నారు పలువురు విద్యావంతులు. ఇది ఆలోచించవలసిన విషయం. ఇలా చేస్తే కొంత కాలానికి నిరుద్యోగిత అంటే జాగ్రత్తగా ఉండాలనే భయం ప్రభుత్వాలు, పార్టీలలో కలుగుతుందని వారు అంటున్నారు. నిరుద్యోగుల కోసం మోసపూరిత హామీలు, అధికారంలోకి వచ్చాక మాట మార్చడం లాంటి విధానాలపై కొంతమేరకు ఆలోచన చేసే పరిస్థితి ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.