25 February, 2026 | 4:27 AM

ఏటీఎం నగదు దొంగ అరెస్ట్

25-02-2026 01:01 AM

రూ.34.90 లక్షలు రికవరీ 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఏటీఎంలకు నగదు సరఫరా చేసే భద్రతా వాహనంలోనే భారీ దోపిడీకి పాల్పడిన డ్రైవర్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న గోపనపల్లి తండా ప్రాంతంలో ఏటీఎంలలో నింపాల్సిన రూ.56 లక్షల నగదును వాహనంతో పాటు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

సంగం సెక్యూరిటీ ఏజెన్సీలో డ్రైవర్గా పనిచేస్తున్న బడిగెరె అజిత్ కుమార్ అలియాస్ శివ (34) ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఏటీఎంలో నగదు నింపుతున్న సమయంలో సిబ్బంది బయట ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని వాహనాన్ని నగదుతో తీసుకుని వెళ్లిపోయాడు. సహచరులను మభ్యపెట్టి నల్లగండ్ల గద్దర్ చౌరస్తా వద్ద వాహనాన్ని వదిలి నగదు పెట్టెతో పరారయ్యాడు.

అదే రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ లాడ్జ్లో దిగిన నిందితుడు పెట్టెను పగులగొట్టి నగదును సంచిలోకి మార్చుకున్నాడు. మరుసటి రోజు అనంతపురం చేరుకుని అక్కడి నుంచి బళ్లారి, బెంగళూరు, పుణే ప్రాంతాలకు మారుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మిగిలిన నగదును వ్యక్తిగత జల్సాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. సంఘటనా స్థల పరిశీలన, సీసీటీవీ దృశ్యాల సేకరణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణతో పాటు సమాచార ఆధారంగా పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించారు.

2 వారాల గాలింపుల అనంతరం ఈరోజు ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.34.90 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును క్రైం నం.278/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్ 306 కింద నమోదు చేశారు.డ్రైవర్ల నియామకం, సిబ్బంది వివరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన భద్రతా సంస్థపై ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం2005 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.