23-06-2025 10:30:42 AM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో(Bellampalli Town) దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్బిఐ ఏటీఎంలో నగదు దొంగతనానికి తెగబడ్డారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాల్ టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని బజాజ్ షోరూం పక్కనగల ఎస్బిఐ ఏటీఎం ను లక్ష్యంగా దొంగల ముఠా భారీచోరికి పథకం పన్నారు. దుండగులు పథకం ప్రకారం తమ వెంట గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్స్ తో వచ్చారు. ముందుగా ఏటీఎం షెటర్ ను ఓపెన్ చేశారు. ఏటీఎం బాక్సును గ్యాస్ కట్టర్ తో కొంతమేరకు కట్ చేశారు. ఇదే క్రమంలో పెట్రోలింగ్ పోలీసుల వాహనాన్ని చూసి దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది.
పోలీసులు నుంచి తప్పించుకునేందుకు వెంట తెచ్చుకున్న కారంపొడి ప్యాకెట్ ను ఘటన స్థలంలో దొంగలు వదిలి వెళ్లారు. అవసరమైతే పోలీసుల పైకి కారంపొడిచల్లి దొంగలు పారిపోయే వ్యూహంతో కారం పొడిని వెంట తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఎంతో పకడ్బందీగా దొంగల ముఠా భారీ చోరీకి స్కెచ్ తో వచ్చారు. పోలీసులు ఒక్క క్షణం ఆలస్యమైతే ఏటీఎంలో ఉన్న నగదు దొంగలపాలయ్యేది. పోలీసు పెట్రోలింగ్ భారీ దొంగతనాన్ని విఫలం చేసింది. ఈ భారీ దొంగతనానికి యత్నించింది హర్యానాకు చెందిన ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దొంగతనానికి ఒడిగట్టిన హర్యానా దొంగల ముఠా కోసం పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య, టూ టౌన్ ఎస్ఐ మహేందర్ సందర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.