23-06-2025 11:41:27 AM
ఇళ్ళ మద్యే అక్రమ బోరు బావుల తవ్వకాలు.
నీరు పడకపోవడంతో అర్థంతరంగా వదిలేసి వెళుతున్న బోర్ వెల్ నిర్వాహకులు.
ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అంటూ స్థానికులు ఆగ్రహం.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఎలాంటి నిబంధనలు పాటించకుండానే స్వలాభం కోసం బోర్లు తవ్వి నీరు పడకపోవడంతో కేసింగ్ తొలగించి బోరుబావులను అర్ధాంతరంగా ప్రజల మద్యే ప్రమాద స్థితిలో వదిలి వెళ్తున్నారు ఫలితంగా స్థానిక చిన్నారులు బోరుబావిలో పడి మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో గత కొంతకాలంగా నూతనంగా ఇంటిని నిర్మించుకోవాలనుకున్న వారు బోర్లు తవ్వించి నీరు పడకపోవడంతో కేసింగ్ తొలగించి వదిలేసి వెళ్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న బోరు బావులను పూడ్చాలని స్థానికులు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. బోరు బావుళ్ళో చిన్నారులు పడి ఏదైనా ప్రమాదం సంభవిస్తే కానీ అధికారులు ఎవరూ స్పందించరా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్ వెల్ నిర్వాహకులు సైతం ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ బోర్లు తవ్వి అమాంతం వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.