జువెలరీ షాప్లో చోరీకి యత్నం
- అలారం మోగడంతో పారిపోయిన దుండగులు
- షాపులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన ముఠా
అబ్దుల్లాపూర్ మెట్, జులై 06: జువెలరీ షాపులో చోరీ(theft)కి యత్నించిన దుండగులు.. అల్లారం మొగుడంతో పారిపోయిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో శ్రీ గణేష్ జువెలరీ షాప్ లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నించారు.
పక్కనే ఉన్న షాప్ గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా జువెలరీ షాప్లో ఉన్న అలారం మోగడంతో భయపడి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతో షాపులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పక్క షాపుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం తెలిసింది.







