21-02-2026 01:25:46 AM
ఒమన్ను చిత్తు చేసిన ఆసీస్
ఫిబ్రవరి 20, కొలంబో: టీ20 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా ఘనవిజయంతో ముగించింది. జింబాబ్వే చేతిలో ఓడి అనూహ్యంగా వరల్ కప్ నుంచి ఇంటిదారి పట్టిన కంగారూలు చివరి గ్రూప్ మ్యాచ్లో మాత్రం అదరగొట్టారు. బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ ఒమన్ను ఆటాడుకుంది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
బంతితో స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ చేస్తే.. బ్యాటింగ్ లో మిఛెల్ మార్ష్ విధ్వంసం హైలెట్ గా నిలిచాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో స్మిత్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. కంగారూలకు దూకుడుగా ఆడేందుకు సిద్ధమైన ఒమన్ కు తొలి బం తికే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అమీర్ కలీమ్ ను బార్ట్ లెట్ డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. తర్వాత మరో ఓపెనర్ , కెప్టెన్ జతిందర్ సింగ్ (17)ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
సోనావాలే(12), హమ్మద్ మీర్జా (16) పరుగులకే ఔటయ్యారు. ఇక్కడ నుంచి ఒమన్ మళ్లీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. స్పిన్నర్ ఆడమ్ జంపా ఎంట్రీతో ఒమన్ ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. వసీమ్ అలీ(32) కాసేపు పర్వాలేదనిపించాడు. స్పిన్నర్ జంపా దెబ్బకు ఒమన్ కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. జంపా 4/21, బార్ట్ లెట్ 2, మాక్స్ వెల్ 2 వికెట్లతో రాణించారు. ఛేజింగ్లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది.
సూపర్ 8కు చేరలేకపోయామన్న కసితో ఒమన్ బౌలర్లను ఆసీస్ ఓపెనర్లు ఎడాపెడా బాదేశారు. మిఛెల్ మార్ష్ విధ్వంసానికి బ్రేక్ కూడా వేయలేకపోయారు. తొలి వికెట్ కు మార్ష్ , హెడ్ తొలి వికెట్ కు 8.1 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. హెడ్ 32 (19 బంతుల్లో 6 ఫోర్లతో) పరుగులకు ఔటైనా... మార్ష్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ కేవలం 9.4 ఓవర్లలో మ్యాచ్ను ముగించింది. మార్ష్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులతో అదరగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ బిలో ఆసీస్ మూడో స్థానంలో నిలిచింది.