16-05-2025 07:18:37 PM
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై మౌనం వీడి, చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్లో అనేక అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా పరిమితికి మించిన భవనాలను నిర్మిస్తున్నారని, అదేవిధంగా వర్షాకాలంలో వర్షపునీరు రోడ్డుపై వరదలు పారకుండా డ్రైనేజీలను నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు దానిపైన మున్సిపల్ అధికారులు స్పందించలేదని, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో గాజులరామారం సర్కిల్ ఎదురుగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలు మాట్లాడుతూ గాజులరామారం సర్కిల్లోని జగద్గిరిగుట్ట డివిజన్,గాజుల రామారారం డివిజన్ లలో అనేక సమస్యలు ఉన్నాయని, అదేవిధంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ పరిమితికి మించి భవనాలను కడుతున్నారని, రోడ్డును ఆక్రమిస్తూ భవనాలను కడుతున్నారని, జగద్గిరిగుట్టలో రోడ్డు వెడల్పు అయినప్పటికీ అక్కడ పార్కింగ్ కు ఉపయోగపడుతుంది కానీ వాహనదారులకు ఉపయోగపడట్లేదని అన్నారు. రెండు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ కి సిపిఐ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తే దానిపై ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా స్పందించలేదని, అదే అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తే అది అక్రమం కానప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలు అనేకమని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు సిపిఐ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోకపోవడం ఆ అక్రమ నిర్మాణాలను అధికారులే ప్రోత్సహించినట్లు అవుతుందని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి పైన అనేక పత్రికలు కథనాలు రాసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దానిని అలుసుగా తీసుకొని నిర్మాణదారులు మరింతగా పరిమితికి మించి జి ప్లస్ ఫైవ్ లాంటి నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు భవిష్యత్తులో నష్టమని వెంటనే మున్సిపల్ అధికారులు సిపిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల కోసం సిపిఐ ఉద్యమిస్తే సానుకూలంగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి కానీ ఉద్యమిస్తున్న వారి పైన అనవసర మాటలు మాట్లాడవద్దని అన్నారు. ఇప్పటికైనా సిపిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించాలని లేదంటే రానున్న రోజుల్లో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, హరినాథ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్,మండల నరసింహారెడ్డి, కోశాధికారి సదానంద్, శాఖ కార్యదర్శిలు కే.వెంకటేష్,సహదేవరెడ్డి, యాదగిరి, సాయిలు, యూసుఫ్, రాజు,శ్రీనివాస్ చారి, ఇమామ్, సామిల్,ప్రభాకర్, భీమేష్, సంతోష్, రామ్ రెడ్డి, కృష్ణ, జంబూ కమలమ్మ,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.