జనగణన 2027లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్
వనపర్తి,(విజయక్రాంతి): జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 26వ తేదీ నుంచి ప్రారంభమైన మొదటి విడత స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మందిరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ సమక్షంలో జిల్లా అధికారులు, అంగన్వాడి సిబ్బందికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ పై అవగాహన కల్పించారు. అనంతరం వారందరితో స్మార్ట్ ఫోన్ల ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జనగణన 2027లో భాగంగా మొదటి విడత స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ మొదటి విడత స్వీయ జనగణన అవకాశాన్ని ప్రజలు https://se.census.gov.in ఈ లింకు క్లిక్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ స్వీయ జన గణన ప్రక్రియలో వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని తమ వివరాలను స్వయంగా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వం కేటాయించిన వెబ్సైట్ ద్వారా స్వీయ జనగణనలో పాల్గొని తమ వివరాలను నమోదు చేయగలరని తెలియజేశారు.
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి : అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను బిఎల్వోలు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ సూచించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 66% మాత్రమే పూర్తయిందని, బిఎల్వోలు క్షేత్రస్థాయిలో ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ యాదయ్య, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర అన్ని జిల్లా శాఖల అధికారులు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.






