09-06-2025 06:43:58 PM
హైదరాబాద్,(విజయ క్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ఏ1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Former SIB Chief Prabhakar Rao)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడని బండి సంజయ్ అన్నారు. సోమవారం బండి సంజయ్ మాట్లాడుతూ... అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందన్నారు. ఇన్ని రోజులుగా పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని విమర్శాలు చేశారు.
ప్రభాకర్ రావు విచారణలో ఇచ్చిన స్టేట్ మెంట్ ను బహిరంగ పర్చాలని బండి డిమాండ్ చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు... తనతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనడని మండిపడ్డారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడని, ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తి చేశారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో..? అని, ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? చెప్పాలన్నారు.
ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు..?, ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారో ప్రజలకు తెలియాలన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులను కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని, 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదని విరుచుకుపడ్డారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి, ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.