15 April, 2026 | 3:29 AM

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల ఆందోళన

20-02-2026 01:08 PM

బీసీ సబ్ ప్లాన్ తక్షణ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం ముందు బీసీ సంఘాలు(BC groups protest) ఆందోళన చేపట్టాయి. బీసీ సబ్ ప్లాన్‌ను(BC Sub Plan) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధర్నాలో పాల్గొన్నారు. బీసీ సంఘాల నాయకులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

బీసీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ, వారికి తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేసి బీసీలకు రావాల్సిన 55వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, గృహ నిర్మాణం, వృత్తి అభివృద్ధి వంటి రంగాల్లో బీసీలకు 42 శాతం అమలు చేయాలని అలా జరిగినప్పుడే బీసీలకు లాభం చేకూరుతుందని మల్లన్న పేర్కొన్నారు.