21 April, 2026 | 3:31 AM

బీర్ల ధరలు బుస్సు!

21-04-2026 02:14 AM
  1. మద్యం ప్రియులకు సమ్మర్ షాక్ 
  2. ధరలు సవరించాలని మద్యం కంపెనీల ఒత్తిడి 
  3. డిమాండ్‌కు తగినట్లుగా  సరఫరాచేయని కంపెనీలు
  4. మే నెలలో బీర్లకు కొరత తప్పదంటున్న అబ్కారీ శాఖ అధికారులు 
  5. రోజుకు 1.8 లక్షల కేసుల బీర్ల విక్రయాలు
  6. ఏప్రిల్‌లో ఇప్పటికే 46.40 లక్షల కేసుల అమ్మకాలు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): బీర్ల ధరలకు త్వరలోనే రెక్కలు రాబోతున్నాయి. ఒక వైపు గల్ఫ్ యుద్ధ ప్రభా వంతో పెరిగిన ముడి పదార్థాల ఖర్చుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకంతో పెరుగుతున్న  భారాన్ని తగ్గించుకునేందుకు బీర్ల ధరలు పెంచాలని మద్యం కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచా యి. బీర్లకున్న డిమాండ్‌కు  తగిన విధం గా కంపెనీలు  సరఫరా కూడా  చేయడంలేదు.

దీంతో  బీర్ల ధరలు కొంతమేర సవరించేందుకు సర్కార్ సు ముఖత వ్యక్తంచేసినట్లుగా సమాచారం.  దీంతో పాత ధరలకు విక్రయాలు నిలిపివేయడమే కాకుండా.. కొత్త ధరల కోసం మద్యం కంపెనీలు  ఎదురుచూస్తున్నట్లు సమాచారం. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం ధరలు సవరిస్తారు. అందులో  భాగంగా 2025 జనవరిలోనే కొత్త ధరలు అమలుచేయాల్సి ఉంది. అంతకుముం దు 2023 మేలో ధరలు పెరిగాయి.

నిబంధనల ప్రకారం 2025 మే నాటికి మళ్లీ పెంచాల్సి ఉంది. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఇక ఈ ఏడాదిలో గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సహజ వాయువు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఫలితంగా మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అలానే వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయా లు ఏర్పడ్డాయి. ముడిసరుకు కొరత ఏర్పడిందని, దీనివల్ల మద్యం తయారీ కష్టమవుతున్నదని కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 

ఒక కేసు బీరు అమ్మితే కంపెనీలకు రూ. 330 మాత్రమే లాభం వస్తుందని, అదే ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపంలో దాదాపు రూ. 1,400 వరకు ఆదాయం వస్తుందని మద్యం తయారీ కంపెనీల లెక్కలు చెబుతున్నారు. ధరలు పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు.. కంపెనీలు మాత్రం పాత ధరలకే సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయి.  దీనివల్ల రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మార్చి నుంచే పెరుగుతున్న బీర్ల అమ్మకాలు.. 

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ ద్యం దుకాణాలు, బార్లు,  క్లబ్బుల్లో గత ఏడాది మార్చి నెలలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు 21 శాతం మేరకు పెరిగాయి. నిరుడు మార్చిలో 46.40 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడు మార్చిలో రికార్డుస్థాయిలో 50.78 లక్షల కేసులు అమ్ముడు పోయాయి. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని చెప్పవచ్చును. ఏప్రిల్  నెల గడవకముందే 15 రోజుల్లో 46 లక్షల కేసుల విక్రయాలు కేసుల విక్రయాలు జరగడం విశేషం.

ప్రస్తుతం రోజుకు సగటున 1.70 లక్షల నుంచి 1.80 లక్షల వరకు బీర్ కేసులు అమ్ముడుపోతున్నాయి. వాస్తవానికి ఎండలు ముదరకముం దే.. అంటే జనవరి నుంచే బీర్ అమ్మకాలు పెరిగాయి. గత సంంత్సరం జనవరిలో 31 లక్షల కేసుల బీర్ ల అమ్మకాలు జరిగితే, ఈ జనవరిలో అవి 34 లక్షలకు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 28 లక్షల కేసులు మాత్రమే అమ్ముడు కాగా ఈసారి ఏకంగా 38 లక్షల కేసుల విక్రయాలు జరిగాయి. 

పెరుగుతున్న బీర్ల అమ్మకాలు.. 

వేసవికాలంలో  రాష్ట్రంలో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రతిఏటా వేసవిలో బీర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకొని బీర్ల ధరలను కూడా భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం రకం బీర్ల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. బీర్ల ధరను.. ప్రస్తుతం ఉన్నదాని కంటే కనీసం 10- నుంచి 15 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు మద్యం  కంపెనీలు బ్లాక్ మార్కెట్ కు తెరలేపుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు దొరకడం లేదు. ఉన్న బ్రాండ్ల ధరలు కూడా విపరీతంగా పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2642  మద్యం షాపులు, 1127 బార్లతో పాటు పబ్‌లు, క్లబ్బులున్నాయి. ప్రభుత్వం బీర్ల ధరలు పెంచితే..మండుతున్న ఎండలకు చల్లని బీరును సేవించి చిల్లవుదామనుకునే మందుబాబులకు జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఏర్పడింది. 

నీటి కొరత ఏర్పడే ప్రమాదం.. 

ఎండలు ముదురుతుండడం బీర్ల విక్రయాలు ఫిబ్రవరి చివరి వారం నుంచి మరింత పెరిగాయి. మే నెలలో బీర్ల వాడకం పెరిగి నీటి కొరత ఏర్పడితే.. ఉత్పత్తి పడిపోయి బీర్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ క్ శాఖ అంచనా వేస్తోంది. బీర్ల తయారీకి కంపెనీలు  ఎక్కువగా మంజీరా నీటిపైనే  ఆధారపడతాయి. ప్రస్తుతం ఆ నదిలో నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో బీరు తయారీ యూనిట్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి.

ఉత్పత్తి తగ్గితే డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ కొరత లేకుండా మద్యం డిపోల నుంచి దుకాణాలకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు గతంతో పోల్చి చూస్తే 10 నుంచి 12 శాతం అదన ఉత్పత్తి సాధించేలా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది.